ఇంగ్లాండ్ (England) స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ (Jos Buttler టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ‘ది హండ్రెడ్’ టోర్నీలో (The Hundred Tournament) మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ తరఫున వెల్ష్ ఫైర్తో జరిగిన మ్యాచ్లో బట్లర్ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. వెస్టిండీస్ ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్(Kieron Pollard) పేరిట ఉన్న 14,803 పరుగుల రికార్డును అధిగమించి, టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు.
ఈ మ్యాచ్కు ముందు రికార్డు అందుకోవడానికి బట్లర్కు కేవలం 22 పరుగులు మాత్రమే అవసరం కాగా, అతడు 20 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 51 పరుగులు చేశాడు. దీంతో అతని టీ20 కెరీర్ పరుగుల సంఖ్య 522 మ్యాచ్ల్లో 14,833కు చేరుకుంది. ఈ ఇన్నింగ్స్తో బట్లర్ మరోసారి తన విధ్వంసకర బ్యాటింగ్ను ప్రపంచానికి చూపించాడు.
రికార్డు సాధించిన అనంతరం బట్లర్ చేసిన వ్యాఖ్యలు భారత క్రికెట్ అభిమానులను (Indian Cricket Fans) ఆకట్టుకున్నాయి. రికార్డులు ఎప్పటికీ శాశ్వతం కాదని, భవిష్యత్తులో తన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టే సత్తా భారత్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకే (Vaibhav Suryavanshi) ఉందని అతడు చెప్పాడు. అంత చిన్న వయసులోనే వైభవ్ చూపిస్తున్న ఆటతీరు అసాధారణమని ప్రశంసలు కురిపించాడు.
కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశి అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పటికే టీ20ల్లో 40 మ్యాచ్లు ఆడి 1,670 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్(RR) తరఫున 16 మ్యాచ్ల్లో 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకుని తన ప్రతిభను చాటుకున్నాడు.
35 ఏళ్ల జోస్ బట్లర్ కెరీర్ కూడా అద్భుతంగా సాగింది. ఇంగ్లాండ్ తరఫున 160 టీ20 మ్యాచ్ల్లో 4,212 పరుగులు చేసిన అతడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12 ఫ్రాంచైజీ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. వైటాలిటీ బ్లాస్ట్, ఎస్ఏ20, బిగ్ బాష్ లీగ్, బీపీఎల్తో పాటు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ వంటి జట్లకు ఆడి తనదైన ముద్ర వేశాడు.








