సినిమాల్లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను నేరుగా వెల్లడించే నటి అనసూయ భరద్వాజ్ మరోసారి వివాదంలో నిలిచారు. ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు మతపరమైన చర్చకు దారితీయడంతో వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. హిందూ మతం, సనాతన ధర్మాన్ని ఉద్దేశించి అనసూయ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకులు హైదరాబాద్లోని బోరబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఇటీవల అనసూయ ‘జై శ్రీరామ్’ నినాదాన్ని ప్రస్తావిస్తూ.. కొందరు వ్యక్తులు దానిని ఉపయోగించుకుని ఇతరులపై దాడులకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనసూయ మాటలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
తనపై వచ్చిన ఆరోపణలపై అనసూయ కూడా ఘాటుగా స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, తన మాటలను కొందరు కావాలనే ఎడిట్ చేసి వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. తాను ఏ మతం, కులం లేదా వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.
తాను సనాతన ధర్మాన్ని పాటించే హిందువునని, ఆంజనేయ స్వామి భక్తురాలినని అనసూయ పేర్కొన్నారు. తన వ్యాఖ్యలు హిందూ మతానికి వ్యతిరేకం కాదని తెలిపారు. చివరగా ‘జై శ్రీరామ్’, ‘జై హనుమాన్’ అంటూ తన ప్రకటనను ముగించారు.
మరోవైపు బీజేపీ నాయకుల ఫిర్యాదును బోరబండ పోలీసులు స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. అనసూయ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు, ఫిర్యాదులోని అంశాలను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అనసూయకు సోషల్ మీడియాలో వివాదాలు కొత్తేమీ కాదు. అయితే తాజా వ్యవహారం మతపరమైన అంశంతో ముడిపడి ఉండటంతో మరింత సున్నితంగా మారింది. ఒకవైపు ఆమె వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని బీజేపీ నేతలు ఆరోపిస్తుండగా.. మరోవైపు తన వ్యాఖ్యలను వక్రీకరించారని అనసూయ చెబుతున్నారు. దీంతో ఈ కేసు దర్యాప్తు ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.







