అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విరాళాల చోరీ, నిధుల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం కీలక ప్రకటన చేసింది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రాలకు సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. విరాళాల వ్యవహారంలో వీరిద్దరి ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని దర్యాప్తు నివేదికలో స్పష్టం చేసింది.
విరాళాల నిధుల నిర్వహణపై గతంలో వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ కేసును సమగ్ర దర్యాప్తు కోసం సిట్కు అప్పగించింది. అనంతరం దర్యాప్తు అధికారులు కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, ఇతర రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ పరిశీలన అనంతరం విరాళాల నిధుల వ్యవహారంలో చంపత్ రాయ్, డాక్టర్ అనిల్ మిశ్రాలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని సిట్ అధికారులు తేల్చినట్లు తెలుస్తోంది. చోరీకి గురైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిధులు, బ్యాంకు లావాదేవీలతో ట్రస్ట్ ఉన్నతాధికారులకు సంబంధం లేదని దర్యాప్తులో నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.
సిట్ క్లీన్ చిట్ ఇవ్వడంతో ట్రస్ట్ ప్రతినిధులపై వచ్చిన ఆరోపణలకు తెరపడినట్లయింది. మరోవైపు ఈ కేసులో అసలు నిందితులుగా గుర్తించిన వారిపై చట్టపరమైన తదుపరి చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.








