రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్ష హోదా (Opposition Status) అంశం మళ్లీ వేడెక్కింది. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ (MLA Tatiparthi Chandrasekhar) మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీనేనని (YSRCP) స్పష్టం చేశారు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం రాజ్యాంగబద్ధమైన హక్కు అని, ప్రభుత్వం కావాలనే భయంతోనే ఆ హోదాను నిరాకరిస్తోందని ఆరోపించారు. టీడీపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందన్నారు. 175 నియోజకవర్గాల ప్రజల ఆకాంక్షలను సభలో వినిపించే అవకాశం ఇవ్వాలని, వైఎస్ జగన్కు(Ys Jagan) మాట్లాడే హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 3.2 లక్షల కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం విద్యార్థుల ఫీజు బకాయిలను కూడా చెల్లించలేదని ప్రశ్నించారు.
ఇక ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు (MLC Thoomati Madhava Rao) గవర్నర్ ప్రసంగంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రసంగంలో వాస్తవాలకు విరుద్ధంగా విషయాలు చేర్చారని ఆరోపిస్తూ, పీఏసీ చైర్మన్ పదవిని కూడా అధికార పక్షం స్వాధీనం చేసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. అప్పుగా తెచ్చిన లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత 20 నెలల్లో ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు కాలేదని విమర్శించారు. కౌన్సిల్లో ప్రభుత్వ తప్పిదాలను బహిర్గతం చేస్తామని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇస్తారని, భవిష్యత్తులో తమ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.






