ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Sessions) హంగామా మధ్య ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు సమావేశాలు మొదలయ్యాయి. గవర్నర్ (Governor) అబ్దుల్ నజీర్ (Abdul Nazeer) ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ప్రసంగం ప్రారంభమైన వెంటనే వైసీపీ సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు.
జగన్ నేతృత్వంలో వైసీపీ వాకౌట్
కొద్దిసేపటి తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) సహా వైసీపీ సభ్యులంతా గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
గవర్నర్ తన ప్రసంగంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన పథకాల గురించి వివరించారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని పేర్కొన్నారు.
గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు (Ayyanna Patrudu) అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలు, రాష్ట్ర బడ్జెట్ 2026-27పై ప్రతిపాదనలపై చర్చించనున్నారు.
మార్చి 12 వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. అదేవిధంగా మార్చి 5 నుంచి 7 వరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు సమాచారం.






