---Advertisement---

మరోసారి డిక్లరేషన్ వివాదం – జగన్ ఒక్కరికే ఈ నియమమా?

March 5, 2026

---Advertisement---

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా మతతత్వ రాజకీయాలు పురుడుపోసుకున్నాయి. గత కొంతకాలంగా ప్రజా సమస్యలు (Public Issues) పక్కకు పోయి దేవాలయాలు (Temples), ప్రసాదాల నాణ్యతపైనే (Prasadam Quality) రాజకీయం నడుస్తోంది. ఇది స్వార్థ రాజకీయాల్లో భాగమే అని ప్రజలందరికీ అర్థం అవుతున్నా, ఎదురు మాట్లాడలేని నిస్సహాయ పరిస్థితి ప్రజలది. తాజాగా మరోసారి మత రాజకీయానికి మండలి వేదికైంది.

జగన్‌కు (Y. S. Jagan Mohan Reddy) దేవదేవుడిపై ఎలాగూ నమ్మకం లేదని, తిరుమలలో (Tirumala) డిక్లరేషన్ (Declaration) కూడా ఇవ్వలేదని పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) గారు మండలిలో చెప్పుకొచ్చారు. అలాగే మంత్రి లోకేష్ (Nara Lokesh) కూడా మండలి వేదికగా అదే మాట మాట్లాడారు. గతంలో కూడా ప్రతి తెలుగుదేశం, జనసేన నాయకులు సైతం ఏదో ఒక సందర్భంలో జగన్‌ను టార్గెట్‌గా చేస్తూ ఈ తిరుమల డిక్లరేషన్‌పై మాట్లాడిన వారే.

ఏమిటి డిక్లరేషన్?

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించే ఇతర మతాలకు చెందిన భక్తులు (జి.ఓ. ఎంఎస్ నంబర్ 311, రెవెన్యూ ఎండోమెంట్స్-1) నిబంధన 136 ప్రకారం తిరుమలలోని శ్రీవారి ఆలయానికి వచ్చినప్పుడు వైకుంఠం వద్ద ఉన్న రిజిస్టర్‌లో స్వామివారిపై విశ్వాసం ఉన్నట్లు ఒక డిక్లరేషన్‌పై సంతకం చేయాలనే నిబంధన ఉంది. గతంలో ఎప్పుడు లేని ఈ నిబంధన 1990 ఏప్రిల్ 9 నుండి అమలులోకి వచ్చింది.

అయితే నాటి నుండి అనేక మంది ఫరూక్ అబ్దుల్లా నుండి అబ్దుల్ కలాం, సోనియా గాంధీ వరకు కొంతమంది డిక్లరేషన్‌పై సంతకం పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాగే పెట్టని వారు కూడా ఉన్నారు. అయితే ఒకసారి స్వామివారిని నమ్మకతో దర్శనం చేసుకున్న తర్వాత మళ్లీ రెండో సారి స్వామివారిని దర్శించుకునే సందర్భంలో డిక్లరేషన్ ఇచ్చినట్లు ఆధారాలు లభ్యం కాలేదు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి (Dr. Y. S. Rajasekhara Reddy) గారు కూడా 1990 తరువాత అనేకసార్లు స్వామివారిని దర్శించుకున్నారు. 2008లో ఆయన స్వామివారికి భక్తితో 1.5 కిలోల బంగారు గొలుసును సమర్పించారు. ముఖ్యమంత్రి హోదాలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే వైయస్సార్ తండ్రి రాజారెడ్డి (Raja Reddy) గారు కూడా తిరుమల స్వామివారిని దర్శించుకున్న సందర్భాలు ఉన్నాయి. 2009లో వైయస్ జగన్ గారు తిరుమల స్వామివారిని దర్శనం చేసుకున్నారు. నాడు ఈ డిక్లరేషన్ వివాదం తలెత్తలేదు.

అయితే జగన్ గారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి, ఎంపీగా కడపలో భారీ విజయం సాధించిన అనంతరం 2012లో కడప ఎంపీ హోదాలో తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఫారమ్‌పై వివాదాన్ని ముందుకు తెచ్చారు. అయితే నాడే జగన్ గారు తాను 2009లోనే స్వామివారిని దర్శించుకున్నానని, ఒకసారి దర్శించుకున్న తాను పదే పదే ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తన తండ్రి, తాత కాలం నుండి తమ కుటుంబం స్వామివారిని దర్శించుకుంటోందని, ఇప్పుడు తాను కొత్తగా స్వామివారిపై భక్తి ఉందని తెలుగుదేశం, కాంగ్రెస్ సభ్యులకు చెప్పాల్సిన పనిలేదని తెలిపారు.

దీంతో 2012 ఆగస్టు 13వ తేదీ నుండి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని నాటి టీటీడీ(TTD) సంయుక్త కార్యనిర్వహణాధికారి కె.ఎస్. శ్రీనివాసరాజు తెలిపారు. నిబంధన 136 ప్రకారం తిరుమలలోని జెఈఓ కార్యాలయం, పేష్కార్ కార్యాలయం, అలాగే అన్ని సబ్ ఎంక్వైరీ కార్యాలయాల్లో ఆయా రిజిస్టర్లలో ఇతర మతాలకు చెందిన భక్తులు స్వామివారి దర్శనానికి ముందు సంతకం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

అయితే 2014, 2017, 2019ల్లో జగన్ గారు ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో దర్శనానికి వెళ్లినప్పుడు మరోసారి డిక్లరేషన్ నిరాకరించారు. ఇక జగన్ గారు సీఎం హోదాలో తిరుమలకు వెళ్లినప్పుడు కూడా డిక్లరేషన్ సమర్పించలేదనే విమర్శలు వచ్చాయి. కాని ఆయన గతంలో మాదిరిగానే స్పందిస్తూ, స్వామివారికి సీఎం హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం ఆ స్వామివారే కల్పించారని అభిప్రాయపడ్డారు. హైకొర్టు కూడ ప్రజల తరుపున ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళిన జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

నిజానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నాకే తన సుదీర్ఘ పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్ర ముగిసిన తర్వాత తిరుపతి నుండి కాలినడకన వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్లారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా స్వామివారి దర్శనం చేసుకున్నాకే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి శ్రీవేంకటేశ్వర స్వామివారి మీద అపారమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయని దీనికంటే పెద్ద ఆధారాలు అవసరం లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

అలాగే 2009లో స్వామివారిని దర్శించుకున్న వ్యక్తి నుండి పదే పదే డిక్లరేషన్ ఇవ్వమని చెప్పడం రాజకీయ కుట్రలో భాగమేనని, ఇది కేవలం రాజకీయ పార్టీల మతతత్వ అజెండాలో భాగమేనని పలువురు స్పష్టం చేస్తున్నారు. తాను క్రైస్తవురాలని చెప్పుకున్న హోం మంత్రి వంగలపూడి అనిత, గవర్నర్ హోదాలో అబ్దుల్ నజీర్ లాంటి వారు వచ్చినప్పుడు వారిని పదే పదే డిక్లరేషన్ ఇవ్వమని అడగని వారు, జగన్ గారు వస్తే మాత్రం డిక్లరేషన్ అంటూ రాజకీయం చేయడం భగవంతుడిని అడ్డు పెట్టి రాజకీయం చేయడం కాదా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా డిక్లరేషన్ అంటూ పదే పదే స్వామివారి విషయంలో రాజకీయ పార్టీలు రాజకీయం చేయడం మంచి సంప్రదాయం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment