సోషల్ మీడియాలో (Social Media) సెలబ్రిటీలను (Celebrities) టార్గెట్ చేస్తూ అసభ్యకర వ్యాఖ్యలు (Abusive Comments) చేసే వారిపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా నటి రేణు దేశాయ్ (Renu Desai) ఫిర్యాదుతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది.
రేణు దేశాయ్ ఫిర్యాదు.. ఇద్దరు నిందితులు అరెస్ట్
కొంతకాలంగా తనపై వస్తున్న అసభ్య కామెంట్లు, వ్యక్తిగత దూషణలపై రేణు దేశాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తూ వేధిస్తున్న నాలుగు సోషల్ మీడియా ఖాతాలపై ఆమె సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను (Cyberabad Cyber Crime Police) ఆశ్రయించారు. ఈ ఫిర్యాదును సీరియస్గా తీసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది.
కేటుగాళ్లకు పోలీసుల హెచ్చరిక
ఫేక్ ఖాతాల ద్వారా ఎవరికీ కనిపించకుండా కామెంట్లు చేస్తున్నామనుకునే వారికి పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కడ ఉన్నా, ఎంత రహస్యంగా వ్యవహరించినా సాంకేతిక పరిజ్ఞానంతో తప్పకుండా పట్టుకుంటామని స్పష్టం చేశారు.
ఇప్పటికే నటి అనసూయను సోషల్ మీడియాలో వేధించిన కేసులో కూడా ఒకరిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వరుసగా జరుగుతున్న ఈ చర్యలు సోషల్ మీడియా వేధింపులకు పాల్పడే వారిలో భయం కలిగిస్తున్నాయి. ఇలాంటి వేధింపులకు గురైన వారు వెంటనే పోలీసులను సంప్రదించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీసులు తెలిపారు.






