ఆంధ్రప్రదేశ్లోని (Andhra Pradesh) మార్కాపురం (Markapuram) సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident) తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రాయవరం వద్ద ఉన్న క్వారీ మలుపులో కంకర లోడ్తో వస్తున్న టిప్పర్ లారీని (Tipper Lorry) ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Travels Bus) ఢీకొట్టడంతో భారీ ప్రమాదం జరిగింది. ఢీకొన్న వెంటనే రెండు వాహనాల్లో మంటలు చెలరేగి క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో 13 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు.
మలుపు వద్ద ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న ప్రయాణికులు
తెలంగాణలోని (Telangana) జగిత్యాల (Jagtial) నుంచి పామూరు వైపు వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్స్ బస్సు (Harikrishna Travels) ఉదయం 6:00 – 6:30 గంటల మధ్య రాయవరం (Rayavaram) క్వారీ మలుపు వద్దకు చేరుకుంది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. బస్సు ముందు భాగంలో ఉన్న కొంతమంది ప్రయాణికులు వెంటనే కిందకు దూకి ప్రాణాలు దక్కించుకోగా, వెనుక సీట్లలో ఉన్న వారు బయటకు రాలేక మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాద సమయంలో బస్సులో సుమారు 41 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు 13 మంది మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. మరో 22 మందికి పైగా గాయపడగా, వీరిలో 6 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, తీవ్రంగా గాయపడిన వారిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి మార్చారు.
మృతుల్లో ఎక్కువ మంది కనిగిరి, పామూరు ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.






