సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కంగ్టి మండలం రాసోల్ గ్రామంలో అంగన్వాడీ టీచర్ (Anganwadi Teacher) వసంత కుమారిపై (Patlolla Vasanthakumari) గ్రామస్తులు అమానుషంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
గ్రామస్తులు టీచర్ను ఈడ్చుకెళ్లి చెట్టుకు (Tree) కట్టేసి కొట్టినట్లు సమాచారం. గంటకు పైగా చిత్రహింసలకు గురిచేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జుట్టు కత్తిరించి గాడిదపై ఊరేగిస్తామని బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. బాధితురాలు ఎంత ప్రాధేయపడినా కనికరం చూపకుండా దారుణంగా వ్యవహరించినట్లు వివరాలు చెబుతున్నాయి.
ఈ దాడికి కారణంగా బాధితురాలి భర్త వ్యవహారం ఉన్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇన్సూరెన్స్ (Insurance) పేరుతో గ్రామస్తుల నుంచి డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వలేదని ఆగ్రహంతో ఈ దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. భర్తపై ఉన్న కోపాన్ని సంబంధం లేని మహిళపై చూపడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.






