అనంతపురం జిల్లాలో రాయలసీమ అభివృద్ధి, ముఖ్యంగా నీటి ప్రాజెక్టుల అంశం రాజకీయంగా వేడెక్కింది. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై తీవ్ర ఆరోపణలు చేశారు.
కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు. అదే దారిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించారని తెలిపారు. అయితే చంద్రబాబు నాయుడు రాయలసీమకు అన్యాయం చేశారని, హైకోర్టు, ఎయిమ్స్ వంటి కీలక ప్రాజెక్టులను ఇతర ప్రాంతాలకు తరలించారని విమర్శించారు.
రాయలసీమ ప్రజలు టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చినా, వారి అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విఫలమయ్యారని ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిన తర్వాతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ కూటమికి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు అవసరమని పిలుపునిచ్చారు.
ఇక మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ తెలంగాణకు తమకు వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పారని ప్రాజెక్టు పనులు నిలిపివేయడం సరైంది కాదని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి అనుమానాస్పదంగా ఉందని అన్నారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తయితేనే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 800 అడుగుల లోతులో నీటిని తీసుకురావడం సాధ్యమవుతుందని చెప్పారు. 854 అడుగుల స్థాయిలో నీరు తరలించడం అసాధ్యమని వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు అవసరమైన నీటి వాటాలను సాధించవచ్చని పేర్కొన్నారు.






