కడప జిల్లాలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మైదుకూరు సమీపంలోని ఖాజీపేట అగ్రహారంలో కీర్తన అనే విద్యార్థిని హత్యకు గురైన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రేమోన్మాది దాడిగా భావిస్తున్న ఈ ఘటన ప్రజలను ఒక్కసారిగా షాక్కు గురిచేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కీర్తనపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి గొంతు కోసినట్లు అనుమానిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే చికిత్స కోసం కడపకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించి ఆంజనేయకొట్టాలు గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన అనంతరం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రేమ వ్యవహారం నేపథ్యంలో ఈ దారుణం జరిగినట్లు స్థానికులు భావిస్తున్నప్పటికీ అసలు కారణాలు ఏమిటన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. శిక్షలు పడుతున్నా ఇలాంటి సంఘటనలు ఆగకపోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.






