ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం లోక్ భవన్లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన ఎమ్మెల్సీ నామినేషన్ల అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా మంత్రి అజారుద్దీన్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
తెలంగాణ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజారుద్దీన్ పదవికి ప్రస్తుతం సాంకేతిక అడ్డంకులు ఎదురవుతున్నాయి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి 6 నెలల్లోగా అసెంబ్లీ లేదా కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నిక కావాలి.
అజారుద్దీన్ మంత్రి పదవిని చేపట్టి ఈ నెల 30వ తేదీకి 6 నెలలు పూర్తికానున్నాయి. అంటే మరో 10 రోజుల్లోపు ఆయన చట్టసభ సభ్యుడిగా ఎన్నిక కాకపోతే మంత్రి పదవిని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఫైల్ కొంతకాలంగా పెండింగ్లో ఉంది. ఆ ఫైల్లో అజారుద్దీన్ పేరు కూడా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ నెల 30లోపు గవర్నర్ ఆమోదం తెలుపుతూ గెజిట్ విడుదలైతేనే అజారుద్దీన్ మంత్రి పదవిలో కొనసాగేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా గవర్నర్ను కలిసి తాజా పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది.






