పిఠాపురం (Pithapuram) రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మను టీడీపీ ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే పిఠాపురంలో టీడీపీ–జనసేన (TDP–Jana Sena) మధ్య నెలకొన్న విభేదాలు ఇప్పుడు మరోసారి బహిర్గతమయ్యాయి.
సీట్ల పంపకాల సమయంలో వర్మకు కాకుండా పొత్తు ధర్మం పేరుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు (Pawan Kalyan) పిఠాపురం టికెట్ కేటాయించడం అప్పట్లో టీడీపీ కేడర్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. అయినప్పటికీ చంద్రబాబు మాటకు కట్టుబడి వర్మ ఎక్కడా తిరుగుబాటు చేయకుండా మౌనంగా వ్యవహరించారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ స్వయంగా వర్మను కలిసి తన గెలుపు బాధ్యత మీ చేతుల్లో పెడుతున్నానని కోరడంతో, వర్మ పూర్తి స్థాయిలో సహకరించి జనసేన అభ్యర్థి విజయానికి కృషి చేశారు.
అయితే పవన్ కళ్యాణ్ విజయం అనంతరం పరిస్థితులు మారిపోయాయి. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వర్గపోరు తగ్గకపోగా మరింత తీవ్రమైంది. పవన్ గెలిచిన మరుసటి రోజే వర్మ ఫ్లెక్సీలను జనసేన కార్యకర్తలు చించివేయడం, అనంతరం వర్మ వాహనాలపై దాడులు జరగడం పరిస్థితులను ఉద్రిక్తంగా మార్చాయి. ఈ వివాదాలు క్రమంగా ఫ్లెక్సీ వార్గా మారి రెండు వర్గాల మధ్య తీవ్ర విభేదాలకు దారి తీశాయి.
తాజాగా ఓ ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటో లేకపోవడంపై వర్మ ఆగ్రహం వ్యక్తం చేయడం, జనసేన వర్గీయులతో ఘర్షణకు దిగడం పరిస్థితిని మరింత ముదిర్చింది. ఈ ఘటనలో వాగ్వాదం దాడి స్థాయికి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. ఆ సమయంలో చంద్రబాబు మాట కోసం ఇప్పటివరకు మౌనంగా ఉన్నామని, ఇకపై పరిస్థితులు వేరుగా ఉంటాయని వర్మ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ వ్యవహారం చంద్రబాబును అసహనానికి గురి చేసినట్లు తెలుస్తోంది. పార్టీ సమావేశంలో పరోక్షంగా వర్మను మందలించిన చంద్రబాబు, అనంతరం పవన్ కళ్యాణ్తో జరిగిన భేటీలో కూడా పిఠాపురం అంశాన్ని చర్చించినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ నుంచి వర్మపై ఫిర్యాదులు రావడంతో, చివరకు ఆయనను ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పించి నియోజకవర్గ వ్యవహారాల కోసం ప్రత్యేక కమిటీని నియమించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పుడీ నిర్ణయంపై వర్మ అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం, చంద్రబాబు కోసం వర్మ చేసిన త్యాగాలను మరిచి, పవన్ కళ్యాణ్ చెప్పుడు మాటలు విని ఇలా వ్యవహరించడం సరైంది కాదని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మరోవైపు వర్మ తదుపరి అడుగు ఏంటన్నదానిపై పిఠాపురం రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. పవన్ కళ్యాణ్ను నమ్మి సహకరించిన వర్మకు ఇప్పుడు అదే రాజకీయంగా పెద్ద దెబ్బగా మారిందా? అన్న చర్చ స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.






