అత్యంత వైభవంగా జరిగే శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ (Sri Prasanna Tirupati Gangamma) జాతర ఉత్సవాలు ప్రారంభానికి సిద్దం అయింది. స్థానిక ప్రజలు తమ ఇంటి ఆడబిడ్డగా భావించే గంగమ్మ తల్లిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి జాతర ఉత్సవాల సందర్భంగా చోటుచేసుకున్న ఒక ఘటన తీవ్ర వివాదానికి దారితీస్తోంది.
ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం (Annadanam Program) కోసం భక్తుల నుంచి విరాళాలు (Donations) సేకరించేందుకు ఏర్పాటు చేసిన బ్యానర్లో క్యూఆర్ కోడ్ను అందుబాటులో ఉంచారు. భక్తులు అమ్మవారి సేవ కోసం విరాళాలు సమర్పిస్తున్నామని భావించి నగదు పంపుతుండగా, ఆ మొత్తం సీఎం చంద్రబాబు (CM Chandrababu) ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోని (Kuppam) “మన అన్నా క్యాంటీన్” (Mana Anna Canteen) ఖాతాలో జమ అవుతోందని వెలుగులోకి రావడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంపై ఆలయ పాలకవర్గ సభ్యులను ప్రశ్నించగా, “మాకు తెలియదు.. ఛైర్మన్ రవిచంద్రబాబును (Chairman Ravichandra Babu) అడగండి” అంటూ సమాధానం ఇస్తున్నారని సమాచారం. ఇక ఛైర్మన్ స్పందన మరింత వివాదాస్పదంగా మారింది. “అమ్మవారి అన్నదానం అయినా, అన్నా క్యాంటీన్ అన్నదానం అయినా అన్నదానమే కదా” అంటూ నిర్లక్ష్యంగా వ్యాఖ్యానించినట్టు భక్తులు ఆరోపిస్తున్నారు.
భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఆలయ పాలకవర్గం వ్యవహరిస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. అమ్మవారి సేవ కోసం సమర్పించిన విరాళాలను ప్రభుత్వ నిధులతో నడవాల్సిన అన్నా క్యాంటీన్ ఖాతాకు మళ్లించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇది భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే చర్య అని, జాతర విరాళాలను పక్కదారి పట్టించడం సరైన పద్ధతి కాదని ఆధ్యాత్మిక వేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు.
ఈ ఘటనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, భక్తుల సందేహాలకు ఎలాంటి సమాధానం ఇస్తుందో అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.






