---Advertisement---

ఏపీలో ఇంధన ధరల మంటలు.. హామీలు మరిచి జగన్‌పై నిందారోపణ రాజకీయమా?

May 18, 2026

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌, డీజిల్ ధరల పెరుగుదల మరోసారి రాజకీయ వేడిని రాజేసింది. కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను పెంచిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యాట్ తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికల ముందు మానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పెట్రోల్‌, డీజిల్ ధరలను తగ్గిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీ అమలు విషయంలో సమాధానం చెప్పలేని పరిస్థితిలో పడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇంధన ధరల పెంపుతో ప్రజలపై రూ.3 కంటే ఎక్కువ భారం పడిందని, ఇది సామాన్యుల నడ్డి విరిచే నిర్ణయమని విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అయితే ఈ విమర్శలకు సమాధానం ఇవ్వాల్సిన ప్రభుత్వం, సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టకుండా వైసీపీపై ఎదురుదాడికి దిగిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం దేశంలోనే అధిక ఇంధన ధరలు ఉండటానికి గత ప్రభుత్వమే కారణమని తెలుగుదేశం సోషల్ మీడియా ప్రచారం చేస్తుండగా, దీనిని అర్ధసత్యాలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమని సామాజిక వేత్తలు విమర్శిస్తున్నారు.

2015 నుంచే చంద్రబాబు ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై 31 శాతం వ్యాట్ కొనసాగించడంతో పాటు అదనంగా రూ.4 సెస్ విధించిందని, ఆ భారాన్ని తగ్గించకుండా ఇప్పుడు జగన్ ప్రభుత్వం రోడ్ల మరమ్మతుల కోసం విధించిన ఒక్క రూపాయిని మాత్రమే ప్రధాన అంశంగా చూపించడం ఎందుకని నిలదీస్తున్నారు. “జగన్ విధించిన ఒక్క రూపాయి ఎక్కువా? లేక చంద్రబాబు కాలం నుంచి కొనసాగుతున్న 31% వ్యాట్, రూ.4 సెస్ ఎక్కువా?” అని ప్రశ్నిస్తున్నారు.

కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం వరుసగా 18 సార్లు పెట్రోల్‌, డీజిల్ ధరలు పెంచినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేసినవారే ఇప్పుడు అధికారంలో ఉన్నారని గుర్తుచేస్తున్నారు. అప్పుడు కేంద్రంలో భాగస్వామ్యం లేకపోయినా జగన్ ప్రభుత్వాన్ని నిలదీసిన కూటమి నేతలు, ఇప్పుడు తమకు కేంద్రంతో పొత్తు ఉన్నప్పటికీ రాష్ట్రంలో వ్యాట్ తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించడంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

అలాగే ఎన్నికల సమయంలో “మేము అధికారంలోకి వస్తే పెట్రోల్ ధరలు తగ్గిస్తాం” అని స్పష్టంగా హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు ఆ హామీ అమలు చేయకుండా మళ్లీ జగన్‌పై ఆరోపణల రాజకీయమే చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనా వంటి మహమ్మారి సమయంలో జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయి మాత్రమే పెంచిందని, కానీ ఎలాంటి సంక్షోభం లేని 2015లో చంద్రబాబు ప్రభుత్వం రూ.4 సెస్ విధించిందని గుర్తుచేస్తున్నారు. అదే ప్రస్తుతం ఏపీలో ఇతర రాష్ట్రాల కంటే అధిక ధరలకు ప్రధాన కారణమని చెబుతున్నారు.

ఈ మొత్తం వివాదంలో ప్రజల దృష్టిని అసలు హామీల నుంచి మళ్లించి, సోషల్ మీడియా ప్రచారంతో రాజకీయంగా లాభపడాలనే ప్రయత్నం జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వ్యూహం ఎంతవరకు పనిచేస్తుంది? ప్రజలు హామీలను గుర్తుంచుకుంటారా? లేక మరోసారి రాజకీయ ప్రచారానికే లోనవుతారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment