పాకిస్తాన్లో(Pakistan) మరోసారి అజ్ఞాత వ్యక్తుల దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి. భారత వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాల్లో (Anti-India Terrorism) కీలక పాత్ర పోషించిన పుల్వామా దాడి (Pulwama Attack) సూత్రధారుల్లో ఒకడైన బుర్హాన్ హమ్జా (Burhan Hamza) హత్యకు గురయ్యాడు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్ (Muzaffarabad) ప్రాంతంలో అతని మృతదేహం లభ్యమవడంతో అక్కడ భారీ కలకలం రేగింది.
హమ్జాను గుర్తుతెలియని దుండగులు అత్యంత సమీపం నుంచి అనేకసార్లు కాల్చినట్లు సమాచారం. “డాక్టర్”(Doctor) పేరుతో గుర్తింపు పొందిన హమ్జా అసలు పేరు అర్జుమండ్ గుల్జార్ దార్(Arjumand Gulzar Dar). ఇతడు కాశ్మీర్లోని పుల్వామాకు చెందినవాడు. 2022లో భారత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అతడిని అధికారికంగా ఉగ్రవాదిగా ప్రకటించింది.
పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ హమ్జాకు ప్రత్యేక రక్షణ కల్పించిందని సమాచారం. అతడి కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయడంతో పాటు, ఏకే-47లతో ఉన్న భద్రతా సిబ్బంది 24 గంటలు కాపలా కాసేవారని చెబుతున్నారు. ఇంత కట్టుదిట్టమైన భద్రత మధ్య హమ్జా హత్యకు గురికావడం పాక్ భద్రతా వ్యవస్థపై అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది.
2019 ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్లోని (Jammu & Kashmir) పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడి దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై (CRPF Convoy) పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని ఢీకొట్టడంతో 40 మంది జవాన్లు అమరులయ్యారు. పాకిస్తాన్ మద్దతుతో పనిచేసే జైషే మహ్మద్ (Jaish-e-Mohammed) ఉగ్రసంస్థ ఈ దాడికి బాధ్యత వహించింది. ఆత్మాహుతి దాడి చేసిన వ్యక్తిని ఆదిల్ అహ్మద్ దార్గా (Adil Ahmad Dar) గుర్తించారు.
ఈ దాడికి ప్రతిగా 2019 ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం బాలాకోట్లోని జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ ఘటన తర్వాత భారత్-పాక్ (India-Pakistan) సంబంధాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి.
ఇటీవల కాలంలో పాకిస్తాన్లో భారత వ్యతిరేక ఉగ్రవాదులతో సంబంధం ఉన్న పలువురు అనుమానాస్పద పరిస్థితుల్లో హత్యకు గురవుతున్నారు. ఇప్పుడు హమ్జా హత్య కూడా అదే కోవలో చోటుచేసుకోవడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.






