విశాఖపట్నంలోని (Visakhapatnam) ఆర్కే బీచ్ (RK Beach) సమీపంలో ఉన్న ప్రసిద్ధ మత్స్యదర్శిని చేపల అక్వేరియం (Aquarium) భవనాన్ని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) (GVMC) కూల్చివేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జీవీఎంసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ భవనాన్ని అక్వేరియంను నిర్వహిస్తున్న ప్రైవేట్ సంస్థకు లీజుకు ఇచ్చిన నేపథ్యంలో మున్సిపల్ సంస్థకు, లీజుదారునికి మధ్య వివాదం తలెత్తినట్లు సమాచారం. ఈ స్థల భవిష్యత్ వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే నగరంలోని అత్యంత విలువైన సముద్రతీర ప్రాంతంలో ఉన్న ఈ స్థలంపై ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తుందనే అంశంపై రాజకీయ, ప్రజావర్గాల్లో చర్చ సాగుతోంది.
ఆదివారం బీచ్ రోడ్డులోని మత్స్యదర్శిని (Matsyadarshini) భవనాన్ని జీవీఎంసీ అధికారులు కూల్చివేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మత్స్య దర్శిని విశాఖ నగరానికి చెందిన ప్రముఖ పర్యాటక ఆకర్షణల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. కుటుంబాలు, విద్యార్థులు, పర్యాటకులు ఏడాది పొడవునా ఈ అక్వేరియంను సందర్శిస్తూ ఉండేవారు. ఇందులో రంగురంగుల క్లౌన్ ఫిష్లు, లయన్ ఫిష్లు, బటర్ఫ్లై ఫిష్లు, స్టింగ్రేలు, సీ అనెమోన్లతో పాటు అనేక అరుదైన సముద్ర మరియు మంచినీటి చేపలను ప్రదర్శించేవారు. కొన్ని చేప జాతులను విదేశాల నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చినట్లు కూడా చెబుతారు.
సముద్ర జీవవైవిధ్యం, మత్స్యసంపద ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంచే ఉద్దేశంతో ఈ మత్స్యదర్శినిని అభివృద్ధి చేశారు. మత్స్యదర్శినిలోని (Matsyadarshini) చేపల ట్యాంకులను పరిశీలిస్తూ సందర్శకులు సముద్ర జీవుల గురించి తెలుసుకునే విధంగా దీనిని విద్యా వాతావరణంలో రూపొందించారు. సముద్రతీరానికి అత్యంత సమీపంలో ఉండటంతో ఇది వైజాగ్ పర్యాటక యాత్రల్లో తప్పనిసరిగా సందర్శించే ప్రదేశంగా మారింది.
ముఖ్యంగా పిల్లలకు ఇది వినోదంతో పాటు విద్యను అందించే కేంద్రంగా నిలిచింది. జల జీవవైవిధ్యం, సముద్ర పర్యావరణ పరిరక్షణ అవసరంపై అవగాహన కల్పించడంలో మత్స్య దర్శిని కీలక పాత్ర పోషించిందని స్థానికులు గుర్తుచేస్తున్నారు. వారాంతాలు, సెలవు దినాల్లో ఇక్కడ పెద్ద ఎత్తున సందర్శకులు తరలివచ్చేవారు.
అయితే ఇలాంటి ప్రముఖ పర్యాటక కేంద్రాన్ని కూల్చివేసే సమయంలో కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. భవనం కూల్చివేత కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అక్వేరియంలో ఉన్న విలువైన చేపలకు ఆక్సిజన్ అందక అవి మృత్యువాత పడుతున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ చర్యల వల్ల అమాయక జలచరాల ప్రాణాలు పోవడం బాధాకరమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థల వివాదాల పరిష్కారంలో భాగంగా చర్యలు తీసుకోవచ్చు కానీ, అరుదైన జీవ సంపద రక్షణపై కూడా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ప్రశ్నిస్తున్నారు.






