ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొ. కె. నాగేశ్వర్ (Prof. K. Nageshwar) పై జనసేన (Jana Sena) అధినేత, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలను సీపీఎం(CPM) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, నాగేశ్వర్పై నమోదైన కేసులను కూడా రద్దు చేయాలని కోరింది. అలాగే ప్రొ. నాగేశ్వర్కు పూర్తి సంఘీభావం ప్రకటిస్తూ ప్రజాస్వామ్యవాదులంతా ఆయనకు అండగా నిలవాలని పిలుపునిచ్చింది.
ఈ మేరకు మంగళవారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు (V. Srinivasa Rao) ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల ఒక టీవీ చర్చలో జగన్ (Y. S. Jagan Mohan Reddy) గురించి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), అమిత్ షాల (Amit Shah) మధ్య ఆసక్తికర చర్చ జరిగిందని నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయన వాటిని ఉపసంహరించుకున్నారని తెలిపారు. అయినప్పటికీ జనసేన పార్టీ ఈ అంశాన్ని ముగించమని ప్రకటించిన తరువాత కూడా రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో నాగేశ్వర్పై ఫిర్యాదులు చేసి కేసులు నమోదు చేయించడం అప్రజాస్వామిక చర్య అని విమర్శించారు.

అలాగే రాజమండ్రిలో జరిగిన జనసేన సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత రాజకీయంగా రగిల్చేలా ఉన్నాయని సీపీఎం అభిప్రాయపడింది. “చర్యకు ప్రతి చర్య ఉంటుంది”, “కర్మ ఎవరినీ వదలదు” వంటి వ్యాఖ్యలు ప్రొ. నాగేశ్వర్ను నేరుగా బెదిరించినట్టుగా ఉన్నాయని పేర్కొంది. ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రమాద సంకేతమని ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు తనపై వచ్చిన విమర్శలను అధికార బలంతో ఎదుర్కోవడం తగదని సీపీఎం మండిపడింది. వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కూడా స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోరింది.






