పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) (Trinamool Congress – TMC) పరిస్థితి రోజురోజుకీ క్లిష్టంగా మారుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొన్న పార్టీకి ఇప్పుడు అంతర్గత సంక్షోభం పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీ భవిష్యత్తుపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు పార్టీ కార్యకర్తల అరాచకాలపై విచారణలు జరుగుతుండగా, మరోవైపు కీలక నేతల రాజీనామాలు మమతా బెనర్జీకి (Mamata Banerjee) తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
తాజాగా అస్సాం (Assam) టీఎంసీ చీఫ్ (TMC Chief) అభిజిత్ మజుందార్ (Abhijit Majumdar) శుక్రవారం తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు మమతా బెనర్జీకి ఈమెయిల్ ద్వారా లేఖ పంపించారు. తన రాజీనామా లేఖలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.
అస్సాంలో టీఎంసీ పార్టీ ప్రతిష్ట క్రమంగా “కేవలం ముస్లింల (Muslims) కోసమే పనిచేసే సంస్థ”గా మారిపోయిందని అభిజిత్ మజుందార్ ఆరోపించారు. ఇదే పరిస్థితి పశ్చిమ బెంగాల్లో కూడా కనిపిస్తోందని పేర్కొన్నారు. పార్టీ రాజకీయ దిశ, పనితీరు తన ఆలోచనలకు విరుద్ధంగా మారిందని, ఇలాంటి పరిస్థితుల్లో టీఎంసీలో కొనసాగడం అసాధ్యమని స్పష్టం చేశారు.
ఇప్పటికే టీఎంసీలో అంతర్గత విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. వందలాది మంది కౌన్సిలర్లు వరుసగా రాజీనామాలు చేస్తున్నట్లు సమాచారం. సీనియర్ టీఎంసీ నేత, మాజీ రాజ్యసభ ఎంపీ శాంతను సేన్ (Shantanu Sen) కూడా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలపై పార్టీని సమర్థించడం కష్టమైందని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు టీఎంసీ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ (Kakoli Ghosh Dastidar) కూడా పార్టీ మహిళా విభాగం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అదే సమయంలో మరో ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై (Kalyan Banerjee) తీవ్ర ఆరోపణలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పార్టీ అంతర్గత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
ఇదిలా ఉండగా, టీఎంసీకి చెందిన పలువురు కార్యకర్తలు, నాయకులు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే మరో 2 సంవత్సరాల వరకు టీఎంసీ నేతలను పార్టీలో చేర్చుకునే ఆలోచన బీజేపీకి లేదని సమాచారం.








