నంద్యాల (Nandyal) శ్రీనివాస్ సెంటర్లో (Srinivas Center) ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి (Dr. Y. S. Rajasekhara Reddy) విగ్రహంపై (Statue) జరిగిన దాడి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన అనంతరం నిందితుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి(YSRCP) చెందిన వ్యక్తి అంటూ కొన్ని రాజకీయ వర్గాలు, అనుకూల మీడియా ప్రచారం చేశాయనే ఆరోపణలు వినిపించాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు ఈ వ్యవహారానికి కొత్త మలుపు తీసుకొచ్చాయి.
వైరల్ అవుతున్న చిత్రాల ప్రకారం, దాడికి పాల్పడిన వ్యక్తి నంద్యాల పట్టణానికి చెందిన జనసేన (Jana Sena Party) అనుచరుడుగా కనిపిస్తున్నాడని పలువురు సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు. దీంతో తొలుత ప్రచారం చేసిన కథనాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ లబ్ధి కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నం జరిగిందా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.

ఒక విగ్రహ ధ్వంసం వంటి సున్నితమైన అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం ప్రజాస్వామ్యానికి (Democracy) మంచిది కాదని విమర్శకులు అంటున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు జరగకముందే ఒక రాజకీయ పార్టీపై ఆరోపణలు చేయడం వెనుక ఉద్దేశాలపై ఇప్పుడు చర్చ సాగుతోంది. ఈ ఘటన ద్వారా ప్రజల దృష్టిని ప్రభుత్వ వైఫల్యాల నుంచి మళ్లించే ప్రయత్నం జరిగిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ ఘటనపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపి అసలు నిజాలను ప్రజల ముందుకు తీసుకురావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే తప్పుడు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. వైఎస్సార్ అభిమానుల మనోభావాలను దెబ్బతీసిన ఈ ఘటన వెనుక ఉన్న ప్రతి అంశాన్ని వెలికితీసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నాయి.






