తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో(TDP) 60 ఇంజనీరింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. ఏఈఈ (సివిల్, ఎలక్ట్రికల్), ఏఈ (సివిల్), ఏటీఓ (సివిల్) పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించిన నియామక ప్రక్రియపై వైఎస్సార్సీపీ(YSRCP) నేత, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) సంచలన ఆరోపణలు చేశారు.
2026 మే 10, 11 తేదీల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో రాత పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో, ఈ నియామకాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు. 2023లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ను రాయలసీమ (Rayalaseema) అభ్యర్థులకు ప్రత్యేక కేటాయింపుల విషయంలో న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో తాత్కాలికంగా నిలిపివేశామని తెలిపారు. అయితే అదే నోటిఫికేషన్ను కూటమి ప్రభుత్వం మళ్లీ అమల్లోకి తీసుకువచ్చిందని విమర్శించారు.
ఇంజనీరింగ్ పోస్టుల (Engineering Posts) భర్తీలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించిన భూమన, ఒక్కో పోస్టును రూ.30 నుంచి రూ.40 లక్షల వరకు విక్రయించారనే ప్రచారం జరుగుతోందని చెప్పారు. టీటీడీ చైర్మన్తో పాటు ఇద్దరు సభ్యుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై స్వతంత్ర, సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
అలాగే 2024-25 సంవత్సరాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశం కల్పించలేదని, రాష్ట్రాన్ని ఒకే జోన్గా పరిగణించడం వల్ల రాయలసీమ ప్రాంత యువతకు అన్యాయం జరిగిందని భూమన ఆరోపించారు. రాయలసీమకు ప్రత్యేక అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే గతంలో నోటిఫికేషన్ను నిలిపివేశామని వివరించారు.
న్యాయపరమైన సమస్యలు పూర్తిగా పరిష్కారం కాకముందే నియామక ప్రక్రియ కొనసాగించడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. గతంలో పారదర్శకత కోసం మద్రాస్ ఐఐటీకి (IIT Madras) నియామక ప్రక్రియ బాధ్యతలు అప్పగించామని గుర్తు చేసిన భూమన, ప్రస్తుతం జరుగుతున్న నియామకాలపై పూర్తి స్థాయి దర్యాప్తు అవసరమని స్పష్టం చేశారు.






