బీచ్ షాక్ (Beach Shacks) పేరుతో సముద్ర తీర ప్రాంతాల్లో మద్యం షాపులు(Liquor Shops), బార్లకు (Bars) అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పౌరసంఘాలు, మహిళా సంఘాలు (Women Organizations) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu Naidu) అధ్యక్షతన జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. తొలిదశలో విశాఖపట్నం(Visakhapatnam), చీరాల (Chirala) బీచ్లలో అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.
సాయంత్రం వేళల్లో కుటుంబాలతో కలిసి బీచ్లకు వచ్చే ప్రజలు, ఉదయం వ్యాయామం కోసం నడిచే వందలాది మంది ఈ నిర్ణయం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని పౌరసంఘాల నేతలు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మద్యం ప్రభావంతో నేరాలు, మహిళలపై దాడులు, కుటుంబ సమస్యలు పెరుగుతున్నాయని, అలాంటి పరిస్థితుల్లో బీచ్లను మద్యం విక్రయ కేంద్రాలుగా మార్చడం సమాజానికి హానికరమని విమర్శించారు.
విశాఖపట్నం ఇప్పటికే డ్రగ్స్(Drugs), గంజాయి మాఫియాలకు (Ganja Mafias) కేంద్రంగా మారే ప్రమాదం ఉందని, ఇప్పుడు బీచ్ ప్రాంతాల్లో మద్యం విక్రయాలకు అనుమతులు ఇవ్వడం పరిస్థితిని మరింత దిగజార్చవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
మహిళా సంఘం ఐద్వా (AIDWA) కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించింది. ఇప్పటికే మద్యం వినియోగం వల్ల మహిళల జీవన ప్రమాణాలు, కుటుంబాల ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటున్నాయని, ప్రజలు విశ్రాంతి కోసం వెళ్లే బీచ్లను మద్యం వ్యాపార కేంద్రాలుగా మార్చడం అత్యంత ప్రమాదకరమని పేర్కొంది. మహిళలపై హింస, కుటుంబ హింస, మత్తు పదార్థాల ప్రభావంతో జరిగే నేరాలు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం మద్యం అమ్మకాల విస్తరణకే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించింది.
ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు, ప్రజాసంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని పౌరసంఘాలు మరియు ఐద్వా హెచ్చరించాయి.






