ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో మరోసారి సంచలనం రేగింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) రాష్ట్ర పోలీసు వ్యవస్థపై, అలాగే చంద్రబాబు ప్రభుత్వంపై(Chandra Babu Government) తీవ్ర ఆరోపణలు చేశారు. సాయికృష్ణ (Saikrishna) కేసులో కీలక సాక్ష్యాలను మాయం చేశారని, పోలీసు వ్యవస్థ పూర్తిగా అధికార పార్టీ ప్రభావంలో పనిచేస్తోందని ఆయన విమర్శించారు.
మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(Pemmasani Chandrasekhar) ఒత్తిడితోనే తనపై అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. తన ఇంటిపై దాడి చేయడమే కాకుండా, ఎలాంటి తప్పు చేయకపోయినా రెండు కేసులు పెట్టి 18 రోజుల పాటు రాజమండ్రి జైలులో ఉంచారని తెలిపారు. ఈ కేసుల్లో ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్లే ఉన్నప్పటికీ తనను అన్యాయంగా అరెస్టు చేశారని పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో ఇద్దరు సీఐలు, ఒక ఎస్ఐకి హైకోర్టు కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేసిందని అంబటి వెల్లడించారు. వంశీధర్ (Vamsidhar) అనే సీఐ, మధు(Madhu) అనే ఎస్ఐ తనను అక్రమంగా జైలుకు పంపించారని ఆరోపించారు. అలాగే పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లుకు (Ganga Venkateswarlu) కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చిందని తెలిపారు. ఈ పోలీసు అధికారులను కేంద్రమంత్రి పెమ్మసాని ప్రోత్సహించారని ఆయన విమర్శించారు.
వచ్చే నెల 29న వినతి పాదయాత్ర చేపడతానని ప్రకటించిన అంబటి, తన ఇంటిపై దాడి చేసిన వారిపై ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. డీజీపీ, ఐజీ, ఎస్పీ, డీఎస్పీలు స్పందించాలని డిమాండ్ చేశారు.
సాయికృష్ణ కేసును ప్రస్తావిస్తూ, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో (Krishnalanka Police Station) ఏడాది కాలానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మాయం కావడం అత్యంత అనుమానాస్పదమని అంబటి అన్నారు. ఐజీ రవి ప్రకాష్ ఆధ్వర్యంలోనే సాక్ష్యాధారాలు మాయం చేశారని, సీఐ నాగరాజుతో బేరసారాలు జరిగాయని ఆరోపించారు. ఎలాంటి తప్పు చేయని తనను జైలుకు పంపిన పోలీసులు, సీఐ నాగరాజుపై మాత్రం అదే విధంగా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.
పోలీసులు ప్రజలను రక్షించడంలో విఫలమయ్యారని, ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు హోంమంత్రి పవన్ కల్యాణ్ బాధ్యత వహించాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. సీఐ నాగరాజును సమర్థిస్తూ మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ ఆత్మపరిశీలన చేసుకోవాలని, హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.






