ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై నిరంతరం ప్రశ్నలు లేవనెత్తుతూ, ప్రభుత్వ హామీలను నిలదీస్తూ ముందుకు సాగుతున్న ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డిపై (Kakarla Venkatarami Reddy) కూటమి ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. సచివాలయంలో అసిస్టెంట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న ఆయనను మొదట సస్పెండ్ (Suspend) చేసిన ప్రభుత్వం, తాజాగా శాశ్వతంగా సేవల నుంచి తొలగిస్తూ (డిస్మిస్) ఉత్తర్వులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
గత 22 నెలలుగా ఉద్యోగుల సమస్యలపై గళమెత్తుతున్న వెంకట్రామిరెడ్డి, ప్రభుత్వ విధానాలపై పలు సందర్భాల్లో తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా పెన్షన్ పంపిణీ, సర్వే టార్గెట్లు, వీడియో కాన్ఫరెన్సుల ఒత్తిడి వంటి అంశాలపై ఆయన స్పందిస్తూ, ఉద్యోగులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో కొద్దికాలంలోనే పలువురు ఉద్యోగులు గుండెపోటుతో మరణించడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోందని ఆయన పేర్కొన్నారు.
అలాగే గ్రామ, వార్డు సచివాలయాల (Village,Ward Secretariats) రేషనలైజేషన్పై (Rationalization) కూడా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సిబ్బంది కొరత, అధిక పనిభారం సమస్యలను పరిష్కరించకుండా, మరింతగా ఉద్యోగులపై ఒత్తిడి పెంచేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వరం వినిపించినందుకే వెంకట్రామిరెడ్డిపై కక్ష సాధింపుల చర్యలు తీసుకున్నారని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలు రాష్ట్రంలో ఉద్యోగుల హక్కులు, ప్రభుత్వ వైఖరి, ప్రజాస్వామ్య విలువలపై మరింత చర్చకు దారితీస్తున్నాయి. ప్రభుత్వం తన వైఖరిని మార్చకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
ఈ ఘటనతో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారికి ఇదే గతి అన్న భయాందోళనలు ఉద్యోగుల్లో పెరుగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి ఎటు దారితీస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.







