ఆంధ్రప్రదేశ్పై (Andhra Pradesh) నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) ప్రభావం రోజురోజుకీ పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే రుతుపవనాలు (Monsoon Winds) శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వరకు చురుగ్గా విస్తరించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.
వాతావరణ శాఖ (Meteorological Department) అంచనాల ప్రకారం అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశముంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
జూన్ 12న అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాలతో రహదారులపై నీరు నిలిచిపోయే అవకాశం ఉండటంతో పాటు చెట్లు విరిగిపడే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు.
కోస్తాంధ్ర ప్రాంతంలో (Coastal Andhra Region) గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని అధికారులు వెల్లడించారు. అత్యవసర పరిస్థితులు లేకపోతే ప్రజలు బయటకు రావద్దని సూచిస్తున్నారు. వర్షాల ప్రభావంతో విద్యుత్ అంతరాయాలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు.
సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశముండటంతో మత్స్యకారులకు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. చేపల వేటకు వెళ్లవద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే సముద్రంలో ఉన్న వారు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించింది. మరో 2 నుంచి 3 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కొనసాగనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.






