పశ్చిమ బెంగాల్ (West Bengal)లో ప్రభుత్వం మారిన తర్వాత పాలనా వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సీఎం సువేందు అధికారి (Suvendu Adhikari) మరో కీలక నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలతో పాటు అన్ని మదర్సాల్లో(Madrasas) కూడా ఇకపై జాతీయ గేయం ‘వందేమాతరం’ (Vande Mataram) ఆలపించడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మైనారిటీ వ్యవహారాలు(Minority Affairs), మదర్సా విద్యాశాఖ (Madrasa Education Department) విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ప్రభుత్వ నిధులతో నడిచే అలాగే ప్రభుత్వ గుర్తింపు పొందిన ఎయిడెడ్ మదర్సాల్లో ప్రతి రోజు ఉదయం ప్రార్థన సమయంలో విద్యార్థులందరూ తప్పనిసరిగా వందేమాతరం పాడాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని అధికారులు స్పష్టం చేశారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలి వారంలోనే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వందేమాతరం తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కొనసాగింపుగానే ఇప్పుడు మదర్సాలకు కూడా ఈ నిబంధనను విస్తరించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని జాతీయ భావజాలాన్ని పెంపొందించే చర్యగా చెబుతుండగా ప్రతిపక్షాలు మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రత్యేకంగా మైనారిటీలు అధికంగా ఉన్న జిల్లాల్లో ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. స్వతంత్రంగా, సొంత నిధులతో నడిచే మదర్సాలపై ఇలాంటి నిబంధనలను బలవంతంగా రుద్దడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. మతపరమైన విద్యాసంస్థల స్వేచ్ఛను ప్రభుత్వం గౌరవించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో బెంగాల్ రాజకీయాల్లో మరోసారి మతం, విద్య, జాతీయత అంశాలపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. రాబోయే రోజుల్లో ఈ అంశంపై మరింత రాజకీయ వేడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.






