భోగాపురం విమానాశ్రయం (Bhogapuram Airport) ప్రారంభోత్సవంలో వేలాది మంది గిరిజన విద్యార్థులతో (Tribal Students) నిర్వహించిన థింసా నృత్య కార్యక్రమం రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గిరిజనుల పవిత్ర సాంస్కృతిక సంప్రదాయంగా భావించే థింసా నృత్యాన్ని భారీ ఈవెంట్గా నిర్వహించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ (PV Ramesh) ముఖ్యమంత్రి చంద్రబాబును (CM Chandrababu) ఉద్దేశించి చేసిన ఎక్స్ పోస్టు వైరల్గా మారింది. గిరిజనుల సంస్కృతి(Tribal People’s Culture), ఆత్మగౌరవాన్ని (Self-Respect) ప్రచార కార్యక్రమాల కోసం ఉపయోగించడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ మీడియా జర్నలిస్ట్ కదంబిని శర్మ(Kadambini Sharma), కార్టూనిస్ట్ సతీష్ ఆచార్యతో (Satish Acharya) పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ అంశంపై సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తారు.
విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా సుమారు 13 వేల మంది గిరిజన విద్యార్థులతో థింసా నృత్యాన్ని (Thinsa Dance) నిర్వహించడం ద్వారా గిరిజన సంప్రదాయాన్ని ఈవెంట్ మేనేజ్మెంట్లో భాగంగా మార్చారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గిరిజన పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ప్రదర్శించే ఈ నృత్యాన్ని ప్రచార కార్యక్రమంగా వినియోగించడంపై గిరిజన సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
అదే సమయంలో, గిరిజన హక్కులకు సంబంధించిన కీలక అంశాలపై ప్రభుత్వం స్పందించడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. జీఓ నెం.3 పునరుద్ధరణ, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడం, ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లో రాజ్యాంగ పరిరక్షణలు పూర్తిస్థాయిలో అమలు చేయడం, ఆదివాసీ భూములు, ఉపాధి, విద్య హక్కులకు రక్షణ కల్పించాలని ఆదివాసీ గిరిజన సంఘాలు ఉద్యమాలు కొనసాగిస్తున్నాయి.
ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా జీఓ నెం.3 పునరుద్ధరణపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ డిమాండ్లపై స్పష్టమైన స్పందన లేకుండానే వేలాది మంది గిరిజన విద్యార్థులను కార్యక్రమాలకు తరలించి రికార్డుల కోసం వినియోగించడం సమంజసమేనా అనే ప్రశ్నలు పలువురు వ్యక్తం చేస్తున్నారు.







