గాదె సాయికృష్ణ (Gade Sai Krishna) మరణం వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ ఘటనపై ప్రముఖ న్యాయవాది, జైభీమ్ రావ్ భారత్ పార్టీ (Jai Bhim Rao Bharat Party) వ్యవస్థాపకుడు జడ శ్రవణ్ కుమార్ (Jada Shravan Kumar) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారాయి. గాదె సాయికృష్ణ మరణానికి నారా లోకేశ్నే(Nara Lokesh) మొదటి ముద్దాయిగా పరిగణించాలని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
రాష్ట్రంలో “రెడ్ బుక్ రాజ్యాంగం” (Red Book Constitution) అమలులోకి వచ్చిన రోజు నుంచే శాంతిభద్రతలు క్షీణించాయని, రెడ్ బుక్ పాలన చేస్తామని ప్రకటించిన నాటి నుంచే చట్టవ్యవస్థ బలహీనపడిందని జడ శ్రవణ్ విమర్శించారు. ఈ పాలనా విధానం కారణంగానే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.
తన సుదీర్ఘ న్యాయవాద జీవితంలో ఇలాంటి కేసును ఎప్పుడూ చూడలేదని జడ శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నప్పుడు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలనే ప్రాథమిక నిబంధనను కూడా పోలీసులు పాటించలేదని ఆయన ఆరోపించారు. విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న తర్వాత జరిగిన పరిణామాలపై అనేక అనుమానాలు నెలకొన్నాయని పేర్కొన్నారు.
అంతేకాకుండా, నారా లోకేశ్ను దుర్యోధనుడితో, చంద్రబాబును(Chandrababu) ధృతరాష్ట్రుడితో, పవన్ కళ్యాణ్ను (Pawan Kalyan) సైంధవుడితో పోల్చిన జడ శ్రవణ్ కుమార్, ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న పాలన కౌరవ పాలనను తలపిస్తోందని విమర్శించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా మరింత చర్చకు దారితీస్తున్నాయి.






