అమెరికా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి హరీష్రావు(Harish Rao) తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై (Future City Project) కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును పూర్తిగా రద్దు (Cancel) చేస్తామని స్పష్టం చేశారు. ఫార్మా సిటీ పేరుతో రైతుల నుంచి భూములు (Farmers Lands) సేకరించి, ఇప్పుడు ప్రాజెక్టు లక్ష్యాలను మార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
ఫార్మా సిటీ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ ఇప్పటికే అనుమతులు ఇచ్చిందని హరీష్రావు గుర్తుచేశారు. ప్రాజెక్టు ఉద్దేశాల్లో మార్పులు చేస్తే రైతుల భూములను తిరిగి అప్పగించాల్సిందేనని పార్లమెంట్ చట్టంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని తెలిపారు. అయితే ప్రస్తుత రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తోందని విమర్శించారు.
ఇటీవల తెలంగాణ హైకోర్టు(Telangana High Court) లో జరిగిన విచారణలో ప్రభుత్వం ఫార్మా సిటీ ప్రాజెక్టు కొనసాగుతోందని తెలిపిందని హరీష్రావు వెల్లడించారు. బయట మాత్రం ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రచారం చేస్తూ, కోర్టులో వేరే విధంగా మాట్లాడటం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.
ఫార్మా సిటీ పరిధిలో విద్యాసంస్థలు, గృహ నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి సహజమేనని, కానీ అసలు ప్రాజెక్టు లక్ష్యాన్ని పూర్తిగా మార్చేయడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. ఫార్మా సిటీ కోసం సేకరించిన వేల ఎకరాల భూమిలో ప్రధాన భాగాన్ని ఇతర వ్యాపార అవసరాలకు వినియోగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే ఫార్మా సిటీ ప్రాజెక్టును ప్రారంభించామని హరీష్రావు తెలిపారు. తెలంగాణ నుంచి ఒక్క ఫార్మా కంపెనీ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నామని, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం దూరదృష్టితో పని చేసిందని పేర్కొన్నారు.






