---Advertisement---

Harmanpreet Kaur: రాష్ట్రపతి చేతుల మీదుగా ‘పద్మశ్రీ’ అందుకున్న మహిళల టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌.!

May 26, 2026

---Advertisement---

భారత మహిళల క్రికెట్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు దేశంలోని 4వ అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మశ్రీ’ లభించింది. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రతిష్టాత్మక అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ గౌరవాన్ని స్వీకరించారు. జనవరి 26న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 131 మంది పద్మ పురస్కార గ్రహీతల జాబితాలో హర్మన్‌ప్రీత్ పేరు చోటు దక్కించుకుంది. భారత మహిళల క్రికెట్‌కు ఆమె చేసిన విశేష సేవలను గుర్తిస్తూ కేంద్రం ఈ గౌరవాన్ని ప్రకటించింది.

2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టును విజయపథంలో నడిపించిన కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించిన భారత జట్టు తొలిసారి మహిళల వన్డే వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత మహిళల క్రికెట్‌లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. 36 ఏళ్ల హర్మన్‌ప్రీత్‌కు ఇది 5వ వన్డే ప్రపంచకప్ కాగా, గతంలో ఎదురైన నిరాశలను అధిగమించి ఈసారి తన నాయకత్వంతో జట్టును విజేతగా నిలబెట్టి చరిత్రలో నిలిచిపోయింది.

పద్మశ్రీ అవార్డు రావడం తన జీవితంలో ఎంతో గొప్ప క్షణమని హర్మన్‌ప్రీత్ ఆనందం వ్యక్తం చేసింది. “రాష్ట్రపతి భవన్ నుంచి మా నాన్నకు కాల్ వచ్చింది. ఈ ఏడాది నాకు పద్మశ్రీ అవార్డు వస్తోందని తెలిసింది. ఇది నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన క్షణం. నా కంటే ముందుగా ఈ విషయం మా తల్లిదండ్రులకు తెలిసినందుకు ఇంకా ఆనందంగా ఉంది” అని ఆమె తెలిపారు.

అలాగే ఈ ఏడాది పద్మ అవార్డు జాబితాలో చోటు దక్కించుకున్న భారత పురుషుల జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా హర్మన్‌ప్రీత్ అభినందనలు తెలిపింది. “రోహిత్ ఎంతో కష్టపడి పనిచేశాడు. అతనికి కూడా ఈ గౌరవం రావడం చాలా సంతోషంగా ఉంది” అని పేర్కొంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment