హీరాగోల్డ్ (Heera Gold) మల్టీ కోట్ల పెట్టుబడి మోసం కేసులో ప్రధాన నిందితురాలు, సంస్థ ఎండీ నౌహీరా షేక్ను (Nowhera Shaik) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు (ED Officials) ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. కొద్ది రోజులుగా దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా అజ్ఞాతంలో ఉంటున్న ఆమెను హర్యానాలోని గుర్గావ్లో (Gurgaon) ఈడీ బృందం అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలిస్తున్నారు.
సుప్రీంకోర్టు (Supreme Court) బెయిల్ రద్దు చేసిన తర్వాత నౌహీరా షేక్ పరారయ్యారు. గుర్గావ్లో అద్దె ఇంట్లో నకిలీ పేరుతో ఉంటూ, ఫోర్జరీ చేసిన ఆధార్ కార్డు సహా పలువురు గుర్తింపు పత్రాలను ఉపయోగించినట్లు ఈడీ దర్యాప్తులో బయటపడింది. హ్యూమన్, టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నిఘా పెట్టిన హైదరాబాద్ (Hyderabad) ఈడీ జోనల్ టీమ్ ఇవాళ ఉదయం ఆమె లొకేషన్ను గుర్తించి అరెస్ట్ చేసింది.
గుర్గావ్లో అరెస్ట్ అనంతరం నౌహీరా షేక్ను ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తీసుకొస్తున్నారు. నగరానికి చేరుకున్న తర్వాత బేగంపేట కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం జైలుకు తరలించే అవకాశం ఉంది. నకిలీ గుర్తింపు పత్రాల వినియోగంపై గుర్గావ్ పోలీసులతో విడిగా ఫోర్జరీ కేసు నమోదు చేయించేందుకు కూడా ఈడీ సిద్ధమవుతోంది.
హీరా గ్రూప్ సంస్థల పేరిట ఏడాదికి 36 శాతం లాభాలు వస్తాయని నమ్మించి అమాయక ప్రజల నుంచి భారీగా డబ్బులు సేకరించినట్లు నౌహీరా షేక్పై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సుమారు రూ.5,978 కోట్ల మేర మోసం జరిగినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇప్పటికే పీఎంఎల్ఏ చట్టం (PMLA Act) కింద హీరా గ్రూప్కు చెందిన రూ.400 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.






