హార్ముజ్ జలసంధి వద్ద వాణిజ్య నౌకలపై దాడులు చేయడం ఏమాత్రం సమంజసం కాదని భారత్ స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి హరీష్ పర్వతనేని ఈ అంశంపై గట్టిగా స్పందించారు. హార్ముజ్ జలసంధిని దిగ్బంధించడాన్ని భారత్ ఖండించింది.
వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, నిరపరాధ సిబ్బందిని ప్రమాదంలోకి నెట్టడం, సముద్ర మార్గాల్లో స్వేచ్ఛా వాణిజ్యాన్ని అడ్డుకోవడం అసహ్యకరమని భారత్ పేర్కొంది. అంతర్జాతీయ చట్టాలను పూర్తిగా గౌరవించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.
హార్ముజ్ ప్రాంతంలో భారతీయ నావికులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. అక్కడ సురక్షిత నౌకాయానాన్ని వెంటనే పునరుద్ధరించాలని భారత్ డిమాండ్ చేసింది.
హార్ముజ్ జలసంధి పునఃప్రారంభం కోసం యూకేలో జరిగిన 60కి పైగా దేశాల సమావేశంలో భారత్ కూడా పాల్గొంది. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ఈ మార్గాన్ని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడానికి చర్యలు అవసరమని అభిప్రాయపడింది.
ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేశాయి. ఆ దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ మరణించినట్లు వార్తలు వచ్చాయి. అనంతరం గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేసింది. అదే సమయంలో హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం నెలకొంది.
ప్రస్తుతం 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు కాస్త ప్రశాంతంగా మారాయి.






