ప్రపంచ క్రికెట్లో (World Cricket) టీమిండియా (Team India) మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. తాజాగా విడుదలైన ఐసీసీ వార్షిక వన్డే ర్యాంకింగ్స్ (ICC ODI Rankings) అప్డేట్లో భారత జట్టు (Indian Team) 118 పాయింట్లతో నెంబర్-1(No-1) స్థానాన్ని నిలబెట్టుకుంది. వరుస విజయాలతో ప్రపంచ క్రికెట్లో అగ్రస్థానాన్ని కాపాడుకుంటూ టీమిండియా తన సత్తా ఏమిటో మరోసారి నిరూపించింది.
అయితే గతంతో పోలిస్తే భారత్కు ఉన్న ఆధిక్యం కొంత తగ్గింది. రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ (New Zealand) జట్టు 113 పాయింట్లతో భారత్కు గట్టిపోటీ ఇస్తోంది. ముందుగా ఇరు జట్ల మధ్య 8 పాయింట్ల తేడా ఉండగా, తాజా అప్డేట్ తర్వాత అది 5 పాయింట్లకు తగ్గింది. భారత్కు 1 పాయింట్ తగ్గగా, కివీస్ జట్టు 2 పాయింట్లు పెంచుకుని రెండో స్థానాన్ని బలపరుచుకుంది.
ఇక ప్రపంచకప్ ఛాంపియన్ ఆస్ట్రేలియా (Australia) జట్టు 109 పాయింట్లతో మూడో స్థానంలోనే కొనసాగుతోంది. టాప్-10 జట్ల జాబితాలో ఈసారి ఒక కీలక మార్పు చోటుచేసుకుంది. ఇప్పటివరకు నాలుగో స్థానంలో ఉన్న పాకిస్తాన్ జట్టు 98 పాయింట్లతో ఐదో స్థానానికి పడిపోయింది. దక్షిణాఫ్రికా జట్టు 102 పాయింట్లతో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుని సత్తా చాటింది.
ఒత్తిడులు, పోటీలు పెరుగుతున్నా టీమిండియా అగ్రస్థానాన్ని కాపాడుకోవడం అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది. ప్రపంచ క్రికెట్లో భారత్ ఆధిపత్యం కొనసాగుతుండటంపై క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు.






