కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో అమలు చేయలేని హామీలతో (Unfulfilled Promises) ప్రజలకు రంగుల సినిమా చూపించి అధికారంలోకి వచ్చారని ఆయన మండిపడ్డారు. నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రస్తుతం గుర్తింపు సమస్య (Recognition Problem) వచ్చిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. శంషాబాద్ సమీపంలో బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) తీసుకువచ్చిన ఒక కంపెనీ ప్రారంభోత్సవానికి రేవంత్ రెడ్డి వెళ్లారని, అక్కడ యాంకర్ కూడా ఆయనను గుర్తుపట్టలేకపోయిందని విమర్శించారు. ముఖ్యమంత్రి పేరు చెప్పాల్సిన చోట మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) పేరు చెప్పిందని ప్రస్తావిస్తూ.. రేవంత్ రెడ్డి కొత్తగా చేసిందేమీ లేక, తాము నిర్మించిన ప్రాజెక్టులకు రిబ్బన్లు కట్ చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను కూడా కేటీఆర్ గుర్తు చేశారు. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు (6 Guarantees) అమలు చేస్తామని బాండ్ పేపర్లపై రాసి ఇచ్చారని, గ్యారెంటీ కార్డులను భద్రంగా పెట్టుకోవాలని ప్రజలకు చెప్పారని అన్నారు. కానీ ఇప్పుడు 1000 రోజులు కావస్తున్నా ఆ కార్డులను ఎక్కడ పెట్టుకోవాలో చెప్పాలని ప్రశ్నించారు. రైతు, మహిళా, యువజన డిక్లరేషన్ల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
హామీల అమలు గురించి అడిగితే ముఖ్యమంత్రి వింత సమాధానాలు చెబుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. 3 నెలల్లో పిల్లలు పుడతారా అని మాట్లాడుతున్నారని, సరే 3 నెలల్లో కాకపోయినా 30 నెలలు గడిచినా ఒక్క హామీ కూడా అమలు కాకపోతే దాన్ని ఏమనాలని నిలదీశారు. కాంగ్రెస్ మాటలు ఆకాశంలో ఉన్నా, క్షేత్రస్థాయిలో పని మాత్రం సున్నా అని విమర్శించారు.
నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపైనా (Uttam Kumar Reddy) కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆరడుగుల ఎత్తు ఉన్న ఉత్తమ్ వల్ల జిల్లాకు ఎలాంటి లాభం జరగలేదని, కృష్ణా నీళ్లు తాగి పెరగడం తప్ప రైతుల కోసం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్కు ఓటు వేసి తప్పు చేశామని ఇప్పుడు నల్గొండ రైతులే చెబుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.






