తమిళనాడు రాజకీయాల్లో (Tamil Nadu Politics) మరోసారి వేడి రాజుకుంది. డీఎంకే అధినేత (DMK Chief), మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) తాజాగా సీఎం విజయ్ (CM Vijay) నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంపై (TVK Government) ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయ్ సాధించిన విజయాన్ని రాజకీయ సునామీగా కాకుండా సినిమా సునామీగా అభివర్ణించిన స్టాలిన్.. ప్రజల్లో ప్రస్తుతం కనిపిస్తున్న ఉత్సాహం కొద్ది రోజుల తర్వాత తగ్గిపోతుందని అన్నారు. చివరకు ప్రజలు(Peoples) మళ్లీ డీఎంకే వైపు తిరిగి వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
విజయ్ ప్రభుత్వం పూర్తి 5 ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయలేదని స్టాలిన్ జోస్యం చెప్పారు. అభిమాన నటుడు పార్టీ పెట్టాడనే భావోద్వేగంతోనే ప్రజలు విజయ్కు ఓట్లు వేశారని పేర్కొన్నారు. అసెంబ్లీలో (Assembly) స్పష్టమైన మెజారిటీకి అవసరమైన 118 స్థానాలను టీవీకే సాధించలేకపోయిందని గుర్తుచేశారు. ప్రస్తుతం విజయ్ ప్రభుత్వం అధికారంలో ఉండటానికి ప్రధాన కారణం డీఎంకేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అన్నాడీఎంకేను (AIADMK) బలహీనపర్చేందుకు టీవీకే అన్ని రకాల ప్రయత్నాలు చేసినా విఫలమైందని స్టాలిన్ విమర్శించారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే గోడ మీద పిల్లిలా ఉందని ఎద్దేవా చేశారు. బయట నుంచి మద్దతు ఇస్తామని చెప్పిన కమ్యూనిస్టులు, వీసీకే (VCK), ఐయూఎంఎల్ (IUML) వంటి పార్టీలు ఇప్పుడు క్యాబినెట్లో చేరడంపై కూడా వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. వారికి అభినందనలు అంటూ సెటైర్లు వేశారు.
ఒక చిన్న బిడ్డ తన తల్లిని వెతుక్కుంటూ తిరిగి వచ్చినట్లే తమిళ ప్రజలు త్వరలోనే డీఎంకే వద్దకు వస్తారని స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
ఇక స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) కూడా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఎదుగుదలకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీనే (Congress Party) అని ఆరోపించారు. గతంలో బీజేపీ విజయాలకు నరేంద్ర మోదీ(Narendra Modi), అమిత్ షా (Amit Shah) కారణమని భావించానని, కానీ ఇప్పుడు అసలు కారణం కాంగ్రెస్ అని అర్థమైందన్నారు.
కాంగ్రెస్ పార్టీకి కనీస కృతజ్ఞత కూడా లేదని ఉదయనిధి మండిపడ్డారు. ఇన్నాళ్లు డీఎంకే పార్టీ కాంగ్రెస్ను తన భుజాలపై మోసిందని, వారి విజయాల కోసం డీఎంకే కార్యకర్తలు కష్టపడ్డారని చెప్పారు. అయితే ఇప్పుడు అదే కాంగ్రెస్ టీవీకే ప్రభుత్వంలో భాగమైందని విమర్శించారు. కాంగ్రెస్ను ఇకపై ఎప్పటికీ నమ్మకూడదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.






