క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్-2027 (ICC Men’s ODI World Cup-2027) టోర్నీ షెడ్యూల్పై (Schedule) కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ మెగా టోర్నీని 2027 అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు నిర్వహించేందుకు తాత్కాలికంగా తేదీలు ఖరారైనట్లు సమాచారం. సౌతాఫ్రికా(South Africa), జింబాబ్వే(Zimbabwe), నమీబియా (Namibia) దేశాలు సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అహ్మదాబాద్లో (Ahmedabad) జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ తేదీలపై ప్రాథమిక అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. జూలైలో ఎడిన్బర్గ్లో (Edinburgh) జరిగే ఐసీసీ వార్షిక సమావేశంలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.
సౌతాఫ్రికాలో (South Africa) అత్యధిక మ్యాచ్లు నిర్వహించనున్నారు. మొత్తం 54 మ్యాచ్లు జరగనున్న ఈ టోర్నీలో 41 మ్యాచ్లు సౌతాఫ్రికాలోని 8 వేదికల్లో నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్, బులవాయోలోని క్వీన్స్ స్టేడియం, విక్టోరియా ఫాల్స్ వేదికలలో కలిపి 8 నుంచి 10 మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది. మిగిలిన 3 మ్యాచ్లకు నమీబియా ఆతిథ్యం ఇవ్వనుంది. జింబాబ్వేలో నిర్మాణంలో ఉన్న ‘ఫేల్ మోసి-ఓ-తున్యా’(Fale Mosi-Oa-Tunya) అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని వచ్చే ఏడాది మేలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2003 తర్వాత ఆఫ్రికా ఖండంలో నిర్వహించబడుతున్న తొలి పురుషుల వన్డే ప్రపంచకప్ ఇదే కావడం విశేషంగా మారింది.
ఈసారి టోర్నీ ఫార్మాట్లో కూడా కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. గత 2 ప్రపంచకప్లలో 10 జట్లు మాత్రమే పాల్గొనగా, 2027 ప్రపంచకప్కు మళ్లీ 14 జట్ల ఫార్మాట్ను ఐసీసీ తీసుకురానుంది. ఈ 14 జట్లను 2 గ్రూపులుగా విభజించి, ప్రతి గ్రూపులో 7 జట్లు ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రతి గ్రూప్లో తొలి 3 స్థానాల్లో నిలిచిన జట్లు ‘సూపర్ సిక్స్’ (Super Six) దశకు అర్హత సాధిస్తాయి. ఆతిథ్య దేశాలు మరియు ఐసీసీ పూర్తి స్థాయి సభ్య దేశాలుగా ఉన్న సౌతాఫ్రికా, జింబాబ్వేలు నేరుగా అర్హత సాధించగా, నమీబియా మాత్రం క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడి ప్రధాన టోర్నీలోకి రావాల్సి ఉంటుంది.
2027-2031 ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (Future Tours Programme – FTP) కింద జరిగే తొలి ఐసీసీ ఈవెంట్ ఇదే కానుంది. అదే సమయంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విస్తరణ, ఫార్మాట్ మార్పులపై కూడా హాంకాంగ్లో జరగనున్న ఐసీసీ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.






