---Advertisement---

పోలీసుల కారులో గంజాయి కలకలం.. యాక్సిడెంట్ తర్వాత అసలేం జరిగింది?

August 16, 2026

Summarize with AI

---Advertisement---

ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలో పోలీసుల వాహనం ప్రమాదానికి గురైన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బల్లికురవ ఎస్సై నాగరాజు, సంతమాగుళూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు స్విఫ్ట్ డిజైర్ కారులో బల్లికురవ నుంచి అద్దంకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. సివిల్ డ్రెస్‌లో ఉన్న ఇద్దరు ఎస్సైలు ప్రయాణిస్తున్న కారు ఓ ఆటోను ఢీకొనడంతో ఆటోలో ఉన్న నలుగురు గాయపడినట్లు తెలుస్తోంది.

ప్రమాదం అనంతరం స్థానికులు పోలీసుల కారును పరిశీలించగా, కారు డిక్కీలో గంజాయి, మద్యం బాటిల్స్ ఉన్నట్లు గుర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఘటనాస్థలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న అద్దంకి సీఐ సుబ్బరాజు అక్కడికి చేరుకోగా, కారు డిక్కీని తెరిచి పూర్తిగా తనిఖీ చేయాలని స్థానికులు పట్టుబట్టినట్లు సమాచారం. అయితే డిక్కీని తెరవకుండా పోలీసులు అడ్డుకోవడంతో స్థానికులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

పోలీసుల కారులో గంజాయి ఉన్నట్లు వచ్చిన ఆరోపణలపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి వాస్తవాలను వెల్లడించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇద్దరు ఎస్సైలను ఘటనాస్థలం నుంచి పోలీసులు తరలించినట్లు సమాచారం. ధర్మవరం ప్రెసిడెంట్, టీడీపీ నాయకుడు చాగంటి రాజేంద్ర కారులో వారిని అక్కడి నుంచి తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.

అయితే కారు డిక్కీలో నిజంగా గంజాయి ఉందా? ఉంటే అది ఎవరిది? పోలీసులు ఎందుకు డిక్కీని తెరవకుండా అడ్డుకున్నారు? ప్రమాదానికి గురైన వాహనంలో ఇద్దరు ఎస్సైలు సివిల్ డ్రెస్‌లో ఎందుకు ప్రయాణిస్తున్నారు? అనే ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ ఆరోపణలపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment