యూట్యూబర్ ప్రశ్న రావణ్పై (Prashna Ravan) నమోదవుతున్న వరుస కేసులు, వరుస అరెస్టుల వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court) ముందుకు చేరింది. తనపై రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులన్నింటినీ ఒకే కేసుగా పరిగణించి, ఒకే చోట విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రశ్న రావణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తన పిటిషన్లో (Petition) రావణ్ కీలక ఆరోపణలు చేశారు. ఒకే అంశం లేదా ఒకే ప్రసంగాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు పోలీస్ స్టేషన్లలో వరుసగా కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. ఒక కేసులో కోర్టు నుంచి బెయిల్(Bail) లభించగానే, వెంటనే మరో పాత కేసు పేరుతో మళ్లీ అరెస్ట్ చేస్తూ అక్రమ నిర్బంధానికి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టవిరుద్ధంగా కొనసాగుతున్న ఈ వరుస అరెస్టులను నిలువరించాలని హైకోర్టును అభ్యర్థించారు.
ప్రస్తుతం ప్రశ్న రావణ్పై పిఠాపురం, సర్పవరం, మచిలీపట్నం, పాయకరావుపేట, గన్నవరం సహా రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నింటినీ ఒకే అంశానికి సంబంధించినవిగా పరిగణించి సమగ్ర విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.
ఇదిలా ఉండగా, ప్రశ్న రావణ్పై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన అనుచరులు, పలువురు విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఒక కేసులో బెయిల్(Bail) వచ్చిన వెంటనే మరో కేసు నమోదు చేసి మళ్లీ అరెస్ట్ చేయడం పరిపాటిగా మారిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా జనసేన(Jana Sena) నేత, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ (Garikapati Siva Shankar) గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో రావణ్పై మరో కేసు నమోదైంది. శివశంకర్ ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది.
ఇదే సమయంలో యలమంచిలి కోర్టు (Yelamanchili Court) శనివారం ప్రశ్న రావణ్కు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ వచ్చిన కొద్దిసేపటికే వేంపాడు టోల్ప్లాజా (Vempadu Toll Plaza) వద్ద పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. మొదట ఆయనను ఏలూరు తీసుకెళ్తారని ప్రచారం జరిగినప్పటికీ, అర్ధరాత్రి గన్నవరం స్టేషన్కు తీసుకువచ్చారు.
రావణ్ను గన్నవరం పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన అనంతరం స్టేషన్ పరిసరాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేషన్లోకి ఎవరినీ అనుమతించకుండా పోలీసులు చర్యలు తీసుకోవడం కూడా చర్చకు దారితీసింది.
ఇలాంటి పరిస్థితుల్లో వరుస కేసులు, వరుస అరెస్టులపై ప్రశ్న రావణ్ దాఖలు చేసిన పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ, న్యాయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.






