ప్రపంచవ్యాప్తంగా వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు ప్రయాణికుల్లో భయాందోళనలు పెంచుతున్నాయి. తాజాగా మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుని కలకలం రేపింది. ఛత్తీస్గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలో సోమవారం ఒక ప్రైవేట్ విమానం (Private Aircraft) కూలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
అడవిలో కూలిన చార్టర్డ్ విమానం
జష్పూర్ (Jashpur) జిల్లాలోని ఆరా కొండ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. నారాయణ్పూర్ (Narayanpur) పరిసరాల్లో ఉన్న రతన్పహలి (Ratanpahli) అడవిలో ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం చెట్లను ఢీకొట్టి కూలిపోయినట్లు గ్రామస్థులు తెలిపారు.
ప్రమాదం అనంతరం కొండ ప్రాంతం మొత్తం మంటలు, దట్టమైన పొగతో కప్పుకుపోయిందని స్థానికులు చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు, అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా అనే వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.






