రాజ్యసభలో (Rajya Sabha) బీజేపీకి(BJP) భారీ రాజకీయ బూస్ట్ లభించింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి చెందిన 7 మంది ఎంపీలు (MPs) బీజేపీలో విలీనం కావడాన్ని రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ (C.P. Radhakrishnan) అధికారికంగా ఆమోదించారు. దీనికి సంబంధించిన రాజ్యసభ బులెటిన్ విడుదల కావడంతో దేశ రాజకీయాల్లో ఈ పరిణామం హాట్ టాపిక్గా మారింది.
బీజేపీలో చేరిన ఎంపీల జాబితాలో రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, స్వాతి మాలివాల్, హర్బజన్ సింగ్, విక్రమ్ సాహ్నే, రాజేందర్ గుప్తా, సందీప్ పాఠక్ ఉన్నారు. ఇక నుంచి వీరిని అధికారికంగా బీజేపీ సభ్యులుగా పరిగణించనున్నారు.
ఈ విలీనంతో రాజ్యసభలో బీజేపీ బలం 106 నుంచి 113కు పెరిగింది. మరోవైపు ఆప్ పార్టీకి ఇది గట్టి షాక్గా మారింది. పార్టీ ఎంపీల సంఖ్య ఒక్కసారిగా 3కు పడిపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
గత శుక్రవారం ఈ 7 మంది ఎంపీలు అకస్మాత్తుగా బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించడంతో ఆప్ శిబిరంలో కలకలం రేగింది. రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్ స్వయంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ను కలిసి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి స్వీట్లు తినిపించి స్వాగతం పలికారు.
ఈ పరిణామంపై ఆప్ నేత సంజయ్ సింగ్ (Sanjay Singh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 7 మంది ఎంపీలు వెళ్లిపోవడం చట్టవిరుద్ధమని ఆరోపించారు. వెంటనే రాఘవ్ చద్దాతో పాటు ఆ 7 మంది సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రజాస్వామ్య నిబంధనలను ఉల్లంఘించిందని మండిపడ్డారు.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann) కూడా ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు. రాఘవ్ చద్దాను “ద్రోహి”గా అభివర్ణిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా పంజాబ్లో ద్రోహుల పోస్టర్లు వేయించి రాజకీయ వేడి పెంచారు.
ఈ పరిణామం రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.






