ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణపై (Privatization) మరోసారి చర్చ మొదలైంది. ఇప్పటికే ఆర్టీసీ (RTC) సేవలు, ప్రభుత్వ (Government) వైద్య కళాశాలలు (Medical Colleges), మున్సిపల్ సేవలు (Municipal Services), రహదారి (Road) ప్రాజెక్టులు వంటి పలు రంగాల్లో ప్రైవేట్ భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇస్తోందన్న విమర్శలు ఎదుర్కొంటున్న కూటమి ప్రభుత్వం (Alliance Government), ఇప్పుడు రామాయపట్నం పోర్టును(Port) ప్రైవేట్ సంస్థకు అప్పగించే నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది.
రాష్ట్ర అభివృద్ధికి కీలక మౌలిక సదుపాయంగా భావిస్తున్న రామాయపట్నం పోర్టును డిజైన్–బిల్డ్–ఫైనాన్స్–ఆపరేట్–ట్రాన్స్ఫర్ (Design-Build-Finance-Operate-Transfer – DBFOT) విధానంలో ప్రైవేట్ సంస్థకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మంత్రివర్గం ఆమోదం తెలిపిన అనంతరం ప్రభుత్వం అధికారిక జీవో కూడా జారీ చేసింది. పోర్టు ఆపరేటర్ ఎంపిక కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (Request for Proposal – RFP) పిలవాలని నిర్ణయించింది. పోర్టు అభివృద్ధి, నిర్వహణ, వాణిజ్య కార్యకలాపాల బాధ్యతలను ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
నిజానికి రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ప్రారంభించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) 2022 జూలైలో సుమారు రూ. 4,902 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కోస్తా తీర ప్రాంత అభివృద్ధికి కీలకంగా మారుతుందనే లక్ష్యంతో ఈ పోర్టును నిర్మించారు.
మొదటి దశలో 34.04 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యంతో నాలుగు బెర్తుల నిర్మాణాన్ని చేపట్టారు. ఇందులో రెండు జనరల్ బెర్తులు, ఒక కోల్ బెర్త్, ఒక మల్టీపర్పస్ బెర్త్ ఉన్నాయి. అలాగే బ్రేక్వాటర్ల నిర్మాణం, డ్రెడ్జింగ్ పనులు, బల్క్ బెర్త్, కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ భవనాల నిర్మాణం వంటి కీలక పనులు పూర్తయ్యాయి.
ప్రభుత్వం మారే సమయానికి పోర్టు నిర్మాణం 90 శాతానికి పైగా పూర్తయింది. బల్క్ బెర్త్ సిద్ధం కావడంతో తొలి వాణిజ్య నౌకను రామాయపట్నం పోర్టులో నిలిపి కార్యకలాపాలు ప్రారంభించాలని అప్పటి ప్రభుత్వం భావించింది. అయితే ప్రభుత్వం మారడంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు.
ఇప్పుడు దాదాపు పూర్తయిన ఈ ప్రాజెక్టును ప్రైవేట్ సంస్థకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నా లెక్కలేని తనంతో ప్రభుత్వం రాష్ట్ర సంపదని ప్రవేటుకు దోచిపెట్టే కార్యక్రమానికే ప్రాధాన్యత ఇస్తుందని తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.






