టాలెంట్, అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సాయి పల్లవి దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. తెలుగు, తమిళ చిత్రాల్లో వరుస విజయాలతో మెప్పించిన ఆమె ప్రస్తుతం బాలీవుడ్లో భారీ చిత్రమైన రామాయణంలో సీత పాత్రలో నటిస్తోంది. అయితే కెరీర్లో ఎంత ఎత్తుకు ఎదిగినా, గతంలో జరిగిన ఒక వివాదం మాత్రం ఆమెను వెంటాడుతూనే ఉంది.
4 ఏళ్ల క్రితం మాటలు.. ఇప్పుడు క్లారిటీ
దాదాపు 4 ఏళ్ల క్రితం జరిగిన ఒక మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్ మీరు మలయాళీలు అయి ఉండి తమిళం ఇంత బాగా ఎలా మాట్లాడుతున్నారు అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన సాయి పల్లవి నేను తమిళ అమ్మాయిని, మలయాళీని కాదు అని సమాధానం ఇచ్చారు.
అయితే 2 ఏళ్ల తర్వాత అదే వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి, మలయాళీ అని పిలిచినందుకు సాయి పల్లవికి కోపం వచ్చిందని తప్పుడు ప్రచారం చేశారని ఆమె తెలిపారు. ఈ వార్తలు చూసి తాను షాక్కు గురయ్యానని, తాను అనని మాటలను తనపై మోపడం చాలా బాధ కలిగించిందని చెప్పారు.
తాను తమిళనాడులోని కోయంబత్తూరులో పుట్టి పెరిగానని, తన మాతృభాష తమిళం మాత్రమేనని చెప్పానని సాయి పల్లవి స్పష్టం చేశారు. ఇతర భాషలను లేదా ఇతర ప్రాంతాల ప్రజలను తక్కువగా చూసే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని తెలిపారు.
సాయి పల్లవి ఇచ్చిన ఈ వివరణతో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న చిన్న వివాదానికి ఇప్పుడు పూర్తిగా తెరపడినట్టైంది.






