తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 950 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధాన పార్టీలైన డీఎంకే, ఏఐడీఎంకే, టీవీకే మధ్య త్రిముఖ పోటీ నెలకొనడంతో రాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి.
అధికారంపై మూడు పార్టీల కన్ను
ఐదేళ్లకు ఒకసారి అధికారాన్ని మార్చే తీర్పు ఇస్తారనే పేరున్న తమిళ ఓటర్లు ఈసారి ఎవరికి అవకాశం ఇస్తారన్న ఆసక్తి నెలకొంది. అధికార డీఎంకే పార్టీ 14 పార్టీల కూటమితో ఎన్నికల బరిలోకి దిగింది. ఈ కూటమిలో భాగంగా డీఎంకే స్వయంగా 164 స్థానాల్లో పోటీ చేస్తోంది.
ముఖ్యమంత్రి స్టాలిన్ నాయకత్వంలోని ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల్లో విశ్వాసం పెంచుకున్నప్పటికీ అవినీతి ఆరోపణలు, కొన్ని సామాజిక సమస్యలు ప్రతికూల అంశాలుగా మారాయి.
మరోవైపు జయలలిత మరణం తర్వాత బలహీనపడిన ఏఐడీఎంకే, ఇంకా బలమైన స్థాయి కార్యకర్తలతో పోటీకి సిద్ధమైంది. పళనిస్వామి నాయకత్వంలో పార్టీ క్రమంగా పుంజుకుంటున్నప్పటికీ ప్రజాదరణలో కొంత వెనుకబడినట్లు కనిపిస్తోంది.
సినీ నటుడు విజయ్ రాజకీయ రంగప్రవేశంతో టీవీకే పార్టీ ఈసారి ప్రధాన చర్చగా మారింది. యువత, మహిళలు, కొన్ని మైనారిటీ వర్గాల మద్దతు టీవీకేకు బలంగా మారింది. అయితే గ్రామీణ స్థాయిలో బలహీనమైన వ్యవస్థ, రాజకీయ అనుభవలేమి సవాళ్లుగా కనిపిస్తున్నాయి.
డీఎంకే వ్యతిరేక ఓట్లు విడిపోతే అధికార పార్టీకి లాభం కలగొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో ఏఐడీఎంకేకు అది నష్టంగా మారే అవకాశం ఉంది. మొత్తం మీద తమిళనాడు ఎన్నికల ఫలితం చివరి వరకు ఉత్కంఠ రేపనుంది.






