ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) పారిశ్రామిక వాతావరణంపై మరోసారి చర్చకు దారితీసే పరిణామం చోటుచేసుకుంది. ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల మద్దతు, ప్రభుత్వ సహకారం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం టాటా పవర్ (Tata Power) తన రూ.6,675 కోట్ల విలువైన 10 గిగావాట్ల తయారీ ప్లాంటును ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఒడిశాలోని (Odisha) గోపాల్పూర్లో (Gopalpur) ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సంస్థ సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ నిర్ణయంతో మరో భారీ పారిశ్రామిక ప్రాజెక్టు రాష్ట్రానికి దక్కకుండా పోయిందనే చర్చ ప్రారంభమైంది.

పరిశ్రమ ప్రతినిధుల వ్యాఖ్యల ప్రకారం, మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమలకు అందించే ప్రోత్సాహకాలు, ప్రభుత్వ మద్దతు వంటి అంశాల్లో ఒడిశా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కంటే మెరుగైన ఎంపికగా కనిపించిందని తెలుస్తోంది. దీంతో రాష్ట్ర పరిశ్రమల శాఖ పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని కల్పించడంలో విఫలమైందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
గతంలో మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ఒక జూమ్ కాల్ ద్వారానే రూ.1.35 లక్షల కోట్ల మిట్టల్ స్టీల్ ప్రాజెక్ట్కు (Mittal Steel Project) వేగంగా అనుమతులు కల్పించారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక ప్రక్రియలు గత జగన్ ప్రభుత్వ (Jagan Government) హయాంలోనే ప్రారంభమయ్యాయని నాడే తేలింది. ఈ నేపథ్యంలో పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం చేస్తున్న ప్రచారం మరియు వాస్తవ పరిస్థితులపై చాలా వెత్యాసం ఉందనే చర్చ జరుగుతోంది.
ఇదే సమయంలో, ఇటీవల విడుదలైన నీతి ఆయోగ్ (NITI Aayog) ‘ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్(Investment Friendliness Index) నివేదికలో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా 8వ స్థానానికి పడిపోవడం కూడా ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా చెబుతున్నారు. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (Ease of Doing Business) ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఇప్పుడు వెనుకబడటం పెట్టుబడుల ఆకర్షణపై వ్యతిరేక ప్రభావం చూపుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్లిన పెట్టుబడుల జాబితా కూడా ఈ చర్చకు మరింత బలం చేకూరుస్తోందని పేర్కొంటున్నారు. హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ (Hindustan Coca-Cola Beverages) అనకాపల్లి జిల్లాలో ప్రతిపాదించిన రూ.1,200 కోట్ల యూనిట్ను ఉపసంహరించుకుని తెలంగాణకు (Telangana) తరలించగా, ఆజాద్ ఇండియా మొబిలిటీ శ్రీసత్యసాయి జిల్లాలో రూ.1,046 కోట్ల గ్రీన్ ప్రాజెక్టును విరమించుకుని చెల్లించిన డిపాజిట్ను కూడా వెనక్కి తీసుకుంది. జిన్ఫ్రా ప్రెసిషన్స్ అనంతపురంలోని రూ.1,150 కోట్ల ప్రతిపాదనను రద్దు చేయగా, జ్యూపిటర్ రెన్యూవబుల్ ఎనర్జీ అనకాపల్లిలో కేటాయించిన 142 ఎకరాల భూమిని తిరిగి అప్పగించి రూ.2,700 కోట్ల పెట్టుబడి నుంచి తప్పుకుంది. అలాగే ఐస్పేస్ టెక్నాలజీస్ విశాఖపట్నంలో ప్రతిపాదించిన రూ.119.18 కోట్ల ఐటీ క్యాంపస్ ప్రాజెక్టును కూడా విరమించుకుంది.

ఈ పరిణామాల మధ్య, టాటా పవర్ వంటి ప్రముఖ సంస్థ కూడా పారిశ్రామిక ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల కారణంగానే మరో రాష్ట్రాన్ని ఎంచుకున్నట్లు ప్రకటించడం రాష్ట్ర పారిశ్రామిక విధానంపై ప్రశ్నలు లేవనెత్తుతోందని, పరిశ్రమల శాఖ పనితీరుపై మరీ ముఖ్యంగా నారా లోకేష్(Nara Lokesh) పనితీరుపై కూడా విమర్శలకు ఇది మరింత బలం చేకూర్చిందని పారిశ్రామిక రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.







