తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో ప్రభుత్వ ఏర్పాటుకు దారితీసిన టీవీకే (TVK) అధినేత విజయ్ (Vijay) సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేడు తమిళనాడు అసెంబ్లీలో (Tamil Nadu Assembly) బలపరీక్ష (Floor Test)ను ఎదుర్కొన్నారు. ఈ బలపరీక్షలో విజయ్ ప్రభుత్వం మెజార్టీని నిరూపించుకోవడంతో అధికార పీఠంపై తన పట్టు నిలబెట్టుకుంది.
అయితే ఈ సందర్భంగా అసెంబ్లీలో తీవ్ర రాజకీయ విమర్శలు వెల్లువెత్తాయి. డీఎంకే (DMK) నేత ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) విజయ్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీవీకే పార్టీ ప్రజల్లో పూర్తి స్థాయి ఆదరణ పొందలేదని, రాష్ట్రంలోని 65 శాతం మంది ఓటర్లు విజయ్ను తిరస్కరించారని అన్నారు. టీవీకేకు వ్యతిరేకంగా సుమారు 3.1 కోట్ల మంది ఓటు వేశారని వ్యాఖ్యానించారు.
ఇంకా విజయ్ ప్రభుత్వం ఏర్పడటానికి డీఎంకే కూటమి పార్టీల మద్దతు కీలకమైందని ఉదయనిధి స్టాలిన్ గుర్తుచేశారు. టీవీకే ఒంటరిగా అధికారంలోకి వచ్చే స్థాయిలో లేదని, గెలుపుపై నమ్మకం లేకపోవడం వల్లే విజయ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారని విమర్శించారు. అసెంబ్లీలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
ఇదిలా ఉండగా బలపరీక్ష సమయంలో అసెంబ్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్పీకర్ ఓట్ల లెక్కింపు ద్వారా సభ్యుల అభిప్రాయాలను నమోదు చేశారు. విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా లేచి నిలబడ్డ ఎమ్మెల్యేల పేర్లను అసెంబ్లీ అధికారులు ఒక్కొక్కరుగా చదివి వినిపించారు.
బలపరీక్షకు ముందు డీఎంకే, ఏఐడీఎంకే (AIADMK) సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అయితే ఏఐడీఎంకే రెబల్ వర్గం టీవీకే ప్రభుత్వానికి మద్దతుగా నిలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది.
చివరకు స్పీకర్ ప్రకటించిన ఫలితాల ప్రకారం విజయ్ ప్రభుత్వానికి 144 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలపగా, 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో తమిళనాడు అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో విజయ్ ప్రభుత్వం విజయాన్ని సాధించినట్లు స్పీకర్ అధికారికంగా ప్రకటించారు.






