ఉత్తరప్రదేశ్లోని (Uttar Pradesh) కాన్పూర్ (Kanpur) సమీపంలో ఘోర విమాన ప్రమాదం (Fatal Plane Crash) జరిగింది. గంగా నది బ్యారేజీ సమీపంలోని ఓ పొలంలో కాన్పూర్కు చెందిన గార్గ్ ఏవియేషన్(Garg Aviation) శిక్షణ సంస్థకు చెందిన ప్రైవేట్ శిక్షణ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న పైలట్(Pilot), కో-పైలట్(Co-Pilot) ఇద్దరూ మృతి చెందారు.
విమానం కూలిన విషయం తెలియగానే స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు పైలట్లను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఇద్దరూ మృతి చెందినట్లు నిర్ధారించారు.
మృతుల్లో పైలట్కు 3,000 గంటలకు పైగా విమానం నడిపిన అనుభవం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన గుజరాత్కు (Gujarat) చెందిన వ్యక్తిగా గుర్తించారు. కో-పైలట్ కర్ణాటకకు (Karnataka) చెందినవారని వెల్లడించారు. మృతుల పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
మరోవైపు విమానం ప్రమాదానికి గురికావడానికి గల అసలు కారణం ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (Directorate General of Civil Aviation – DGCA) అధికారులకు సమాచారం అందించారు.
ప్రమాదానికి దారితీసిన కారణాలను గుర్తించేందుకు డీజీసీఏ (DGCA) ప్రత్యేక బృందం ఘటనాస్థలిని పరిశీలించనుంది. దర్యాప్తు పూర్తయిన తర్వాతే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడిందా.. లేదా ఇతర కారణాలతో ప్రమాదం జరిగిందా అనే విషయం స్పష్టమవుతుందని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, కాన్పూర్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.







