అమరావతి రాజధాని (Amaravati Capital) కోసం భూ సమీకరణ (Land Pooling) కింద తమ పంట భూములు అప్పగించిన రైతుల్లో (Farmers) అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతోంది. అభివృద్ధి చేసిన నివాస, వాణిజ్య ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చినా.. చాలామందికి చెరువులు, పల్లపు ప్రాంతాలు, అనుకూలం కాని ప్రాంతాల్లో ప్లాట్లు కేటాయించారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2025 డిసెంబర్ 26న మందడంలో జరిగిన సమావేశంలో దొండపాటి రామారావు (Dondapati Rama Rao) అనే రైతు తనకు అన్యాయం జరిగిందని వాపోతూ కుప్పకూలి మృతి చెందడం తీవ్ర చర్చనీయాంశమైంది.
రాజధానికి భూములు ఇచ్చిన అనేక మంది రైతులు తాము పదేపదే వినతులు చేస్తున్నా సీఆర్డీఏ(CRDA) స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు (Chandrababu) కోటరీకి చెందిన ప్రముఖులు, టీడీపీ నేతల సన్నిహితులకు మాత్రం అత్యంత విలువైన ప్రాంతాల్లో ప్లాట్లు కేటాయిస్తున్నారంటూ రైతులు మండిపడుతున్నారు.
ఈ ఆరోపణలకు ఉదాహరణగా ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ (Vemuri Radhakrishna) కుటుంబానికి కేటాయించిన ప్లాట్లను రైతులు ప్రస్తావిస్తున్నారు. రాధాకృష్ణ కుమారుడు వేమూరి ఆదిత్య(Vemuri Aditya), కుమార్తె వేమూరి అనూష (Vemuri Anusha) పేర్లపై మంగళగిరి మండలం కురగల్లు రెవెన్యూ గ్రామ పరిధిలోని నీరుకొండలో 5.39 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, 2016లో భూ సమీకరణ కింద సీఆర్డీఏకు అప్పగించారు.

దీనికి ప్రతిఫలంగా వారికి వెస్ట్ బైపాస్ పక్కనే పెద్ద పరిమాణంలోని నివాస ప్లాట్లు, అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ (SRM University) ఎదురుగా ఉన్న నాలుగు రోడ్ల కూడలిలో వాణిజ్య ప్లాట్లు కేటాయించబడ్డాయి. ఈ ప్లాట్లు లాటరీ ద్వారానే వచ్చాయని అధికార వర్గాలు చెబుతున్నప్పటికీ, రైతులు మాత్రం “లాటరీలో ఎప్పుడూ కోటరీకే జాక్పాట్ తగులుతుందా?” అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఈ అంశంపై మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) తీవ్ర విమర్శలు చేశారు. “నీరుకొండ ఎక్కడ.. వారికి కేటాయించిన ప్లాట్లు ఎక్కడ..? వాళ్ల అదృష్టం ఏంటి..? అమరావతి కోసం పొలాలు ఇచ్చిన రైతుల కర్మ ఏంటి..?” అంటూ ఆయన ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాజధాని రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.






