అమర్నాథ్ యాత్రకు (Amarnath Yatra) వెళ్లే భక్తులకు ముఖ్య సమాచారం. ఈ సంవత్సరానికి సంబంధించిన యాత్ర షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్లోని (Jammu & Kashmir) అనంతనాగ్ జిల్లాలో ఉన్న ఈ పుణ్యక్షేత్ర యాత్ర జూలై 3 నుంచి ప్రారంభమై ఆగస్టు 28 వరకు కొనసాగనుంది. మొత్తం 57 రోజుల పాటు ఈ యాత్ర నిర్వహించబడుతుంది. ఈ విషయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ (Lieutenant Governor) మనోజ్ సిన్హా (Manoj Sinha) వెల్లడించారు.
రిజిస్ట్రేషన్, నిబంధనలు తెలుసుకోండి
అమర్నాథ్ యాత్ర ప్రారంభానికి ముందు జూన్ 29న జ్యేష్ఠ పౌర్ణమి (Jyeshtha Purnima) సందర్భంగా తొలి పూజ నిర్వహించనున్నారు. యాత్రకు వెళ్లే భక్తులు ఏప్రిల్ 15 నుంచి ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఈ యాత్ర సముద్ర మట్టానికి 3882 మీటర్ల ఎత్తులో ఉంటుంది. 13 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారికే అనుమతి ఉంటుంది. 70 సంవత్సరాలు దాటిన వారికి అనుమతి ఇవ్వరు.
రిజిస్ట్రేషన్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ వంటి బ్యాంకుల 554 గుర్తింపు పొందిన శాఖల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
యాత్రికుల భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆరోగ్య ధృవపత్రం సమర్పించాలి. అలాగే ప్రతి భక్తుడికి ఆర్ఎఫ్ఐడీ కార్డు (RFID Card) ఇవ్వడం తప్పనిసరి చేశారు.






