ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ కార్యదర్శులపై ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం తీవ్ర చర్చకు దారితీస్తోంది. గతంలో జీవో 91 ద్వారా గ్రేడ్-4, గ్రేడ్-5 కార్యదర్శులను పీడీఓ గ్రేడ్-3గా పదోన్నతి ఇచ్చి, వారి పేస్కేల్ను రూ.25,220 నుండి రూ.28,280కి పెంచిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని కార్యదర్శులు స్వాగతిస్తూ, తమ సమస్యలను పరిష్కరించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
అయితే తాజాగా జీవో 60 ద్వారా ఆ పేస్కేల్ను మళ్లీ రూ.28,280 నుండి రూ.25,220కి తగ్గించడం సంచలనంగా మారింది. హడావుడిగా తీసుకున్న ఈ నిర్ణయంపై పంచాయతీ కార్యదర్శులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పని వత్తిడి, ఐవీఆర్ఎస్ కాల్స్ వల్ల మానసిక ఒత్తిడి ఇప్పటికే అధికంగా ఉందని, ముఖ్యంగా మహిళా కార్యదర్శులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో పేస్కేల్ తగ్గింపు నిర్ణయం తమపై మరింత భారం మోపిందని, ఇది అన్యాయం అని కార్యదర్శులు అభిప్రాయపడుతున్నారు. జీవో సవరణను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పోరాటానికి సిద్ధమని హెచ్చరిస్తున్నారు.
పంచాయతీ రాజ్ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ సమస్యలను పరిష్కరిస్తారని ఆశించిన కార్యదర్శులు, ఈ నిర్ణయంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రభుత్వ వైఖరి మారకపోతే, ఈ వివాదం మరింత పెద్ద ఉద్యమంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.






