గ్రామ (Village), వార్డు(Ward) సచివాలయాల్లో (Secretariats) పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తుపై (Employees Future) ప్రభావం చూపే కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం (Government) తీసుకుంది. మొత్తం 6,124 మంది ఉద్యోగులను వివిధ ప్రభుత్వ శాఖలకు డిప్యుటేషన్పై (Deputation) పంపేందుకు నిర్ణయం తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ (Sai Prasad) అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం, ప్రస్తుతం అమలులోకి రానుంది.
వివిధ శాఖలు కలిపి మొత్తం 10,465 మంది ఉద్యోగుల అవసరం ఉందని ప్రభుత్వానికి తెలియజేయగా, అందులో భాగంగా సచివాలయ వ్యవస్థ నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా మహిళా పోలీసులను (Women Police) హోంశాఖలో సిటిజన్ సర్వీస్ ఫెసిలిటేటర్లుగా(Citizen Service Facilitators), మహిళా శిశు సంక్షేమ శాఖలో మిషన్ వాత్సల్య విభాగంలో, అలాగే ఇతర అభివృద్ధి సంస్థల్లో వివిధ హోదాల్లో వినియోగించాలనే ప్రణాళిక రూపొందించారు.
ఇక ఇంజినీరింగ్ అసిస్టెంట్లను (Engineering Assistants) గృహ నిర్మాణం, రహదారులు, గ్రామీణ నీటి సరఫరా, వైద్య, విద్య, పర్యావరణ వంటి పలు శాఖల్లో వినియోగించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. వార్డు స్థాయి సిబ్బందిని కూడా పట్టణాభివృద్ధి, టౌన్ ప్లానింగ్, సాంఘిక సంక్షేమ వంటి విభాగాలకు మళ్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
అయితే ఈ నిర్ణయంపై సచివాలయ ఉద్యోగుల సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగులను అవసరానికి అనుగుణంగా విభాగాల మధ్య మారుస్తూ ఉండటం వల్ల సచివాలయ వ్యవస్థ బలహీనపడే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ చర్యను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో పరిపాలనా వ్యవస్థపై ఎలా ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.






